ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో చారిత్రాత్మక మ్యాచ్కు గురువారం తెరలేచింది. లండన్లోని ఈ ప్రఖ్యాత వేదికపై 150వ టెస్టుగా ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య పోరు అట్టహాసంగా ఆరంభమైంది. అయితే, తొలి రోజే ఏకంగా 16 వికెట్లు పడ్డాయి. లార్డ్స్ పిచ్ మీద ఇరుజట్ల పేసర్లు పండుగ చేసుకున్నారు.
140 పరుగులకే
ఇంగ్లండ్తో తొలి టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య ఇంగ్లిష్ జట్టు 140 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్ 56 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. మిగతా వాళ్లంతా కనీసం 20 పరుగుల మార్కు దాటలేదు.
కివీస్ బౌలర్లలో కైలీ జెమీషన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నాథన్ స్మిత్ మూడు, విలియం ఓరూర్కీ రెండు వికెట్లతో సత్తా చాటారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కివీస్.. గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి కేవలం 61 పరుగులకే ఆరు వికెట్లు నష్టపోయింది.
కివీస్ మరీ దారుణంగా
ఓలీ రాబిన్సన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, జోష్ టంగ్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి రోజే 16 వికెట్లు పడటం చూసి ప్రేక్షకుడిగా వినోదం పొందినా.. ఓ క్రికెటర్గా తనకు ఇది ఏమాత్రం నచ్చలేదన్నాడు.
పిచ్ మరీ దారుణంగా ఉంది
బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ఈరోజు పిచ్ను దగ్గరగా చూశాను. బంతిని అంచనా వేయడం కష్టమైపోయింది. ఇరుజట్లలో కలిపి దాదాపుగా ఆరుగురు లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగారు. డిఫెన్స్ ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయారు.
బంతి నేరుగా ప్యాడ్ల మీదకే వచ్చింది. దీనిని బట్టి పిచ్ ఎంత దారుణంగా ఉందో చెప్పవచ్చు. నిజానికి ప్రేక్షకుడిగా తొలిరోజే 16 వికెట్లు పడటం చూసి నేను సంతోషించాను. కానీ ఇది మంచి పిచ్ కాదు. లార్డ్స్ మైదానంలో ఇలాంటి పిచ్ చూసి మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ ఏమాత్రం సంతోషించదని చెప్పగలను.
గత కొన్నేళ్లుగా ఈ సమస్య కొనసాగుతోంది. గతేడాది టీమిండియాతో మ్యాచ్ అద్భుతంగా సాగింది. కానీ అప్పుడు కూడా పిచ్ గురించి ఫిర్యాదులు వచ్చాయి. ముందుగా చెప్పినట్లు ఈ పిచ్ అంత గొప్పగా లేదు. కానీ ప్రేక్షకులకు వినోదం పంచుతోంది. ఈ మ్యాచ్ కూడా అలాగే సాగుతుందని అనుకుంటున్నా’’ అని మైకేల్ వాన్ విమర్శించాడు.


