టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతడికి అభిమానులు ఉన్నారు. కోహ్లిని ఒక్కసారి నేరుగా చూస్తే తమ జన్మ ధన్యమైనట్లు భావించే వీరాభిమానులు కూడా కోకొల్లలు.
కోహ్లికి ఉన్న విపరీతమైన ఈ క్రేజ్ అతడికి ఒక రకంగా శాపంగా మారిందంటున్నాడు ఇంగ్లండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్. నిజానికి భారత్లో జీవించడం కోహ్లికి కష్టంగా మారిందని.. అందుకే అతడు లండన్కు మకాం మార్చి ఉంటాడని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్-2025లో లివింగ్స్టోన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్సీబీ లెజెండ్ కోహ్లి (Virat Kohli)తో తనకు ఏర్పడిన అనుబంధం, సహచర ఆటగాళ్ల పట్ల అతడు వ్యవహరించే తీరుపై లివింగ్స్టోన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కోహ్లి అత్యద్భుతమైన వ్యక్తి
స్టిక్ టు క్రికెట్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘కోహ్లి అత్యద్భుతమైన వ్యక్తి. విరాట్కు ప్రత్యర్థిగా బరిలోకి దిగడం నాకెంతో ఇష్టం. అతడితో కలిసి ఆడటాన్ని కూడా ఆస్వాదిస్తా. అతడు ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉంటాడు.
ఎవరికి ఏ అవసరం ఉన్నా.. సలహా, సూచన కావాలన్నా అతడు ముందుంటాడు. అయితే, ఒక్కసారి మైదానంలో దిగిన తర్వాత అతడిలోని పోటీతత్వం తారస్థాయికి చేరుకుంటుంది. అతడు పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా కనిపిస్తాడు.
కుటుంబానికే ప్రాధాన్యం
అయితే, ముందుగా చెప్పినట్లు మైదానం వెలుపల మాత్రం అతడు అందరితో చాలా చాలా బాగుంటాడు. కుటుంబంతో సమయం గడపడం అంటే అతడికి ఎంతో ఇష్టం. నిజానికి ఇండియాలో జీవించే జీవితం అతడికి అసలు ఇష్టం లేదనే చెప్పవచ్చు.

ఇండియాలో లైఫ్ అతడికి నచ్చదు
ప్రతి ఒక్కరూ తననే గమనిస్తూ ఉండటం అతడికి అస్సలు నచ్చదు. కోహ్లి చాలా మంచివాడు. మనసులో ఒకటి.. బయటకు ఒకటి ఉండదు. అయితే, మైదానంలోకి వెళ్లిన తర్వాత మాత్రం అతడిలా పూర్తిగా మారిపోయే మరొక ప్లేయర్ని మాత్రం నేను ఇంతవరకు చూడలేదు’’ అని లియామ్ లివింగ్స్టోన్ చెప్పుకొచ్చాడు.
లండన్లో నివాసం
కాగా బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న కోహ్లికి.. కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. అనుష్క లండన్లోనే అకాయ్కు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కోహ్లి కుటుంబం ఎక్కువగా లండన్లోనే నివసిస్తోంది. బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ఐపీఎల్, స్వదేశంలో జరిగే మ్యాచ్లు, ఆశ్రమాలకు వెళ్లేందుకు మాత్రమే కోహ్లి భారత్కు వస్తున్నాడు.
తమకున్న క్రేజ్ తన పిల్లలపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతో విరుష్క దంపతులు ఇప్పటి వరకు వారి ఫొటోలు కూడా రివీల్ చేయలేదు. లండన్లో సామాన్యుల్లా రోడ్ల మీద నడుస్తూ చిల్ అవడమే తమకు సంతోషంగా ఉంటుందని ఈ జంట పలుమార్లు చెప్పకనే చెప్పింది.
ఇక ఐపీఎల్ టైటిల్ గెలవాలన్న కోహ్లి కల గతేడాది నెరవేరింది. పద్దెమినిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. అదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లోనూ చాంపియన్గా నిలిచింది. దీంతో కోహ్లి సంతోషం రెట్టింపు అయింది.
చదవండి: భారత క్రికెటర్ల రిటైర్మెంట్పై బీసీసీఐ కఠిన నిర్ణయం!


