భారత క్రికెటర్ల రిటైర్మెంట్ విషయంలో బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ లేదా దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలికిన వెంటనే కొందరు ఆటగాళ్లు విదేశీ లీగ్లలో ఆడేందుకు క్యూ కడుతుండటంతో కొత్త విధానం తీసుకురావాలని భావిస్తోంది. ఈ అంశంపై త్వరలో జరుగబోయే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ కీలక చర్చ జరపనుంది.
ఇటీవల తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్ భారత క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి, వెంటనే క్యాండీ రాయల్స్ తరఫున లంక ప్రీమియర్ లీగ్లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో రిటైర్మెంట్ ప్రకటించి విదేశీ లీగ్లలో ఆడే ధోరణిపై బీసీసీఐ దృష్టి సారించింది.
గతంలో దినేశ్ కార్తీక్, యువరాజ్ సింగ్, ఉన్ముక్త్ చంద్, ప్రవీణ్ తాంబే, ఇర్ఫాన్ పఠాన్ వంటి ప్రముఖ క్రికెటర్లు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా, దేశవాళీ క్రికెట్ లేదా ఐపీఎల్ ఆడుతున్నా.. ఏ క్రికెటర్కూ విదేశీ లీగ్ల్లో ఆడేందుకు అనుమతి లేదు. అయితే దేశీయంగా సరైన అవకాశాలు రాని కొందరు క్రికెటర్లు అదే పనిగా భారత క్రికెట్తో సంబంధాలు తెంచుకొని పరాయి దేశ లీగ్లవైపు పయనమవుతున్నారు.


