న్యూస్రీల్
రూ. కోట్లు వెచ్చించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) నిర్మించినా కాలనీల్లోని ప్రజలకు పాట్లు తప్పడంలేదు. సిద్దిపేట పట్టణంలో రూ.301 కోట్ల వ్యయంతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లక్ష్యం గొప్పగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. పలు కాలనీల్లో అవుట్ లైన్ నిర్మాణం చేయకపోవడంతో మురుగు రోడ్లపై, ఖాళీ స్థలాల్లో నిలుస్తోంది. దీంతో దుర్వాసన, దోమల బెడదతో స్థానిక ప్రజలు దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. – సాక్షి, సిద్దిపేట
రోడ్డు పైకి మురుగు
కొన్ని నెలలుగా మా ఇంటి ఎదుట మ్యాన్హోల్ నుంచి డ్రైనేజీ నీళ్లు పారుతున్నాయి. దుర్వాసన, దోమ లతో ఇబ్బంది పడుతున్నాం. రోడ్డుపై పాకురు కావడంతో వాహనదారులు జారిపడిన సంఘటనలూ ఉన్నాయి. –అంజయ్య, మైత్రీవనం
అవుట్ కనెక్షన్ ఇవ్వలేదు
భవానీనగర్, మైత్రీవనంలో యూజీడీకి అవుట్ కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో మురుగు అంతా ఖాళీ స్థలాల్లో నిలుస్తున్నాయి. అధికారులకు ఎన్ని మార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.
–కృష్ణ, భవానీ నగర్, సిద్దిపేట
సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(యూజీడీ) అమృత్ పథకం, టీయూఎఫ్ఐడీసీ నిధులతో ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. సిద్దిపేట మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి రూ.301.81 కోట్లు మంజూరు కాగా ఇందులో అమృత్ పథకం ఫేస్–1, 2లో రూ.229.13 కోట్లు, టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.72.68కోట్లు ఉన్నాయి. ఈ నిధులతో 324 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణం, రెండు ఎస్టీపీలను నిర్మించారు. ఇప్పటి వరకు 25,890 నివాస గృహాలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కనెక్షన్లు ఇచ్చారు. కొన్ని చోట్ల అవుట్ లైన్ నిర్మించకపోవడంతో మ్యాన్ హోల్స్లో నుంచి మురుగు పొంగిపోర్లుతోంది.
దోమలతో నరకం
మురుగు నీరు నిలిచిపోతున్న కాలనీల్లో ప్రజల అవస్థలు అన్నీఇన్నీకావు. దుర్వాసనతో ఇళ్లలో ఉండటం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు నీరు నిలవడం.. దోమలకు నిలయంగా మారడంతో చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పూర్తిస్థాయిలో నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
నిత్యం ఇబ్బందే..
మూడో వార్డులోని మారుతీనగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పూర్తి స్థాయిలో నిర్మించలేదని కాలనీ వాసులు వాపోయారు.మురుగు నీటితో నిత్యం ఇబ్బంది పడుతున్నామన్నారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్కు కాలనీ కమిటీ వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో నరేందర్ రెడ్డి, ఆనంద్, రవీందర్, బాలయ్య, రామ్రెడ్డిలు ఉన్నారు.


