డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్
సిద్దిపేటకమాన్: జిల్లాలో అన్ని ఆరోగ్య కార్యక్రమాల్లో వంద శాతం లక్ష్యాలను సాధించేలా క్షేత్ర స్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. సిద్దిపేట అర్బన్ నాసర్పూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పీహెచ్సీలోని ఫార్మసీ, మందుల నిల్వ గది, ల్యాబ్తో పాటు పలు రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపీ, ఐపీ సేవలను పెంచడంతో పాటు ఎన్సీడీ స్క్రీనింగ్, నమూనాల సేకరణ, ఆరోగ్య పరీక్షలను మరింత విస్తృతంగా నిర్వహించాలని వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, అన్ని రకాల మందుల నిల్వలను ఎప్పటికప్పుడూ పరిశీలిస్తూ అవసరమైన స్టాక్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


