● సద్వినియోగం చేసుకోండి
● అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్
సిద్దిపేటరూరల్: గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేయడానికి ఈనెల 13న కలెక్టరేట్లో నిర్వహించనున్న స్పాట్ కౌన్సెలింగ్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురుకుల, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు మార్కుల మెమో, కులం, ఆదాయ, స్టడీ పత్రాలు, ఆధార్కార్డు, పాస్పోర్టు సైజ్ ఫొటోలు, తీసుకుని కలెక్టరేట్లోని మీటింగ్ హాల్కు ఉదయం 10.30 గంటలకు రావాలని తెలిపారు. అర్హత, సీట్ల ఖాళీల ఆధారంగా భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు.
శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్
సతీశ్కుమార్
హుస్నాబాద్: చదువుతో పాటు నైపుణ్యాభివృద్ధి తప్పనిసరి అని శాతవాహన యూన్సివర్సిటీ రిజిస్ట్రార్ సతీశ్కుమార్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ ద్వారా అకౌంటింగ్పై మూడు రోజుల వర్క్షాపు ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీశ్కుమార్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో నిరంతరం వస్తున్న మార్పులను గమనించాలని, దానికి అనుగుణంగా సామర్థ్యాలను పెంచుకోవాలన్నారు. దార్శనికత, స్పష్టత లేని చదువుతో పోటీ ప్రపంచంలో రాణించలేమని తెలిపారు. డిజిటల్ విప్లవం వల్ల లావాదేవీలన్నీ కూడా ఆన్లైన్ చెల్లింపుల ద్వారానే జరుగుతున్నాయని తెలిపారు. ఖాతాలు, జీఎస్టీ, వ్యాపార కార్యకలాపాల నిర్వాహణ కోసం విద్యార్థులు ట్యాలీ సాఫ్ట్వేర్ను తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి, అధ్యాపకులు హరికాంత్, చంద్రమౌళి తదితరులు ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య
మిరుదొడ్డి(దుబ్బాక): ప్రతీ విద్యార్థి బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆకాంక్షించారు. చైర్మన్ వెంకటయ్య మనవరాలు శ్రేహాన్వి పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సొంత ఖర్చుతో క్రీడా దుస్తులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితానికి చదువే ఆయుధంగా మార్చుకోవాలన్నారు. ప్రభు త్వం అందిస్తున్న స్కాలర్షిప్పులు, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని లక్ష్యం వైపు దూసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ అంజాగౌడ్, సర్పంచ్ జెన్నారెడ్డి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కోహెడరూరల్(హుస్నాబాద్): లండన్లో ఇటీవల బ్రిటన్ ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’ సభ్యుడిగా నియామకం తర్వాత సొంతూరుకు చేరుకున్న ఉదయ్ నాగరాజును అభినందనలతో ముంచెత్తారు. కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు మంగళవారం గ్రామానికి చేరుకోవడంతో గ్రామస్తులు, పలువురు అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కోహెడ మండలాన్ని ప్రపంచ దేశాలు శనిగరం గ్రామం వైపు చూసేలా చేసిన గొప్పు వ్యక్తి అని కొనియాడారు. అలాగే బ్రిటన్ ఎగువ సభకు సభ్యుడిగా ఎన్నిక కావడం హర్షిణీయమన్నారు. శనిగరం గ్రామం నుంచి ఎవరైనా విద్యార్థులు, ఉద్యోగ రీత్యా వచ్చిన వారికి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మన బిడ్డలుగా గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


