గజ్వేల్: కల్లు గీత కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన గీతన్నల చైతన్యయాత్ర మంగళవారం గజ్వేల్లోని ఆర్అండ్ఆర్ కాలనీకి చేరుకుంది. ఈ యాత్రకు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి గీత కార్మికులు వృత్తిని కొనసాగిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 400మంది కార్మికులు మృతిచెందారని, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బాధిత కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లాకు సర్వాయిపాపన్న పేరు పెడతామన్నా హామీ కూడా అమలు చేయాలన్నారు. మరోవైపు హైదరాబాద్తోపాటు అన్ని జిల్లాల్లో కల్తీ పేరుతో కల్లుదుకాణాలపై దాడులతో భయోత్పాతానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. మరికొందరిని జైళ్లపాలుజేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దాడులు ఆపేసి దుకాణాలు తెరవాలన్నారు. లేనిపక్షంలో పోరాటం ఆగదన్నారు. సభలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు రమణ, వెంకటేశ్తోపాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
కొమురవెల్లి(సిద్దిపేట): గౌడ సంఘాలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం గీతన్నల చైతన్య బస్సుయాత్ర కొమురవెల్లికి చేరుకుంది. సందర్భంగా యాత్రకు సంఘీభావం తెలిపిన ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం గౌడ సంఘాలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బస్సు యాత్రకు కొమురవెల్లి గౌడసంఘం నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం నాయకులు మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, కార్యదర్శులు బూడిద గోపి, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గీత కార్మికుల సంక్షేమాన్ని మరిచిన సర్కార్
కల్లు దుకాణాలను పునరుద్ధరించాలి
మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్
గజ్వేల్కు చేరుకున్న గీతన్నల చైతన్యయాత్ర


