సిద్దిపేటకమాన్: పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర స్ఫూర్తితో సిద్దిపేటలో ఈ నెల 19న జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ ఆలయ ప్రతినిధి రంగతీర్థదాస్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... హరే కృష్ణ సత్సంగం ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు రథయాత్ర ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని శ్రీనివాస ధ్యాన మందిరం నుంచి ప్రారంభమై గాంధీచౌక్, సుభాష్రోడ్డు, పాత బస్టాండ్, విక్టరీ చౌరస్తా మీదుగా కొనసాగుతుందని తెలిపారు. రథయాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సభ్యులు బుచ్చిబాబు, మశ్చేందర్, వేణు తదితరులు పాల్గొన్నారు.
సివిల్ సర్వీసెస్ శిక్షణకు దరఖాస్తులు
జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి హమీద్
ప్రశాంత్నగర్(సిద్దిపేట): సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు, ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారి హమీద్ పేర్కొన్నారు. జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్ బంజారాహిల్స్లోని టీజీఎస్సీస్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణకు గాను అర్హత కలిగిన ఎస్సీ,బీసీ,ఎస్టీ అభ్యర్థులు ఈ నెల 19 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 26న పరీక్ష నిర్వహించి, రాణించిన వారికి ఉచిత శిక్షణతోపాటు భోజనం, వసతి, సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు చింతమడక విద్యార్థులు
సిద్దిపేటరూరల్: సిద్దిపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో చింత మడక కేవీఆర్ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థు లు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొత్తరాజిరెడ్డి గురువారం తెలిపా రు. అండర్ 14 బాలికల విభాగంలో ట్రైయాథలాన్ పోటీలో పావని వెండి పతకం సాధించగా, అండర్ 14 బాలుర విభాగంలో 8వ తరగతికి చెందిన రిషి కుమార్ వెండి పతకం సాధించారు. ఈనెల 18న మెదక్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారికి శిక్షణ అందించిన పీడీ వెంకట స్వామిని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయబృందం అభినందించారు.
పీఆర్సీ ప్రకటించకపోతే
ఆందోళనే : పీఆర్టీయూ
గజ్వేల్: దసరాలోపు పీఆర్సీ ప్రకటించకపోతే పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతామని పీఆర్టీయూ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగ మహేందర్రెడ్డి హెచ్చరించారు. గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురవారం పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మూడేళ్లుగా పీఆర్సీ పెండింగ్లో ఉండటం వల్ల ఉద్యోగులంతా ఆవేదన చెందుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు పీఆర్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన పాలకులు నేడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్త చేశారు. ఉపాధ్యాయులకు సంబంధించి ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉన్నా...ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శి శశిధర్శర్మ, లింగం తదితరులు పాల్గొన్నారు.


