
ఐటీఐ.. అందుబాటులోకి
ఫలించనున్న ఏడేళ్ల కల
● నత్తనడకన సాగిన పనులు ● ఆగస్టు నుంచి ప్రారంభం ● నూతనంగా ఏటీసీ సెంటర్ ● ఉద్యోగ అవకాశాలు కల్పించే ఆరు కోర్సులు
దుబ్బాకటౌన్: పదో తరగతి పూర్తయిన విద్యార్థులను పారిశ్రామిక రంగంలో వృత్తి శిక్షణ కలిగిన నిపుణులుగా తయారుచేసి, వారికి ఉపాధి చూపించేలా ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ట్సిట్యూట్)ను ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా 2012లో దుబ్బాకలోని ఒక అద్దె భవనంలో ఐటీఐని ప్రారంభించారు.
రూ.5 కోట్లతో..
ఐటీఐ భవన నిర్మాణానికి దుబ్బాక 16వ వార్డు పరిధిలో నాలుగెకరాల స్థలాన్ని కేటాయించారు. రూ.5 కోట్లతో 2018లో మాజీ మంత్రి హరిశ్రావు పనులకు శంకుస్థాపన చేశారు. ఉపాఽధి, కార్మికశాఖకు చెందిన నిధులతో జీ ప్లస్ఒన్ తరహాలో ఆర్అండ్బీ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టారు.
నత్తనడకన సాగుతూ..
ఆ భవన నిర్మాణ పనులు ప్రారంభించి ఏడేళ్లు కావస్తోంది. ప్రస్తుతం పనులు ముగింపు దశకు చేరాయి. దీని పక్కనే టాటాగ్రూపు సహకారంతో ఐటీఐ విద్యార్థులకు ఏటీసీ(అడ్వాన్డ్ టెక్నికల్ సెంట ర్– అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రం)ని నిర్మిస్తున్నారు. ఇది కూడా పూర్తయితే ఐటీఐ మరింత అప్గ్రేడ్ కానుంది. కాంట్రాక్టర్ జాప్యంతో పనులు నత్తనడకన సాగాయని, ఇప్పటికి చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ విద్యా సంవత్సరం అంటే ఆగస్టు నాటికి ఐటీఐని అందుబాటులోకి తీసుకురావడానికి కాంట్రాక్టర్, ఆర్అండ్బీ అధికారులు కృషిచేస్తున్నారు.
ఆరు రకాల కోర్సులు
ఐటీఐ భవనం, ఏటీసీ కేంద్రం అందుబాటులోకి వస్తే.. యేడాది వ్యవధిగల వివిధ కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. మ్యానుప్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్లో 20 సీట్లు, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్లో 20 సీట్లు, ఆర్టీయస్యన్ యూజింగ్ అడ్వాన్స్డ్లో 10 సీట్లు కొత్తగా రానున్నాయి. అలాగే రెండేళ్ల వ్యవధి గల బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫయర్(మెకానికల్)లో 24 సీట్లు, అడ్వాన్స్డ్ సీఎన్సీ మెషినింగ్ టెక్నీషియన్లో 24 సీట్లు, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికిల్స్లోను సీట్లు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఐటీఐ ప్రిన్సిపాల్ కనకయ్య తెలిపారు.

ఐటీఐ.. అందుబాటులోకి