ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి: దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరుపేద, మధ్య తరగతి విద్యార్థుల ఆశలను, కలలను ఛిద్రం చేసిన నీట్ లీకేజీ కుంభకోణం కేంద్ర ప్రభుత్వ చేతకానితనానికి నిలువెత్తు నిదర్శనమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా రాత్రింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తును కొందరు దళారులు, అక్రమార్కులు మార్కెట్లో అమ్ముకోవడం మన విద్యా వ్యవస్థకే అతిపెద్ద అవమానమన్నారు. అయితే, ఈ అన్యాయాన్ని మౌనంగా భరించకుండా తమ హక్కుల సాధన కోసం నేటి యువత ఢిల్లీ వీధుల్లోకి వచ్చి చేసిన పోరాటం దేశ చరిత్రలో చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. లాఠీ దెబ్బలకు వెనక్కి తగ్గని యువత ధైర్యం దేశానికే స్ఫూర్తిగా నిలిచిందన్నారు.
సంగారెడ్డి క్రైమ్: వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్–1, 2, 3, 4, బ్యాంకింగ్, రైల్వే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎస్సై, కానిస్టేబుల్ ఇతర పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఆగస్టు 14వ తేదీలోగా అన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు నెలకు రూ.1,000 స్టైఫండ్, ఉచిత మెటీరియల్ అందజేస్తామన్నారు. డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్ ఆఫీస్తో పాటు 08455– 277015, 9494390803 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
జహీరాబాద్ టౌన్: బుల్లెట్ రైలు ప్రాజెక్టు సహకారం కోసం సీఎం రేవంత్రెడ్డి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ, కర్నాటక బీజేపీ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ అన్నారు. శనివారం బీదర్ వెళ్తూ స్థానిక అతిథి హోటల్లో కొద్ది సేపు బీజేపీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి పార్టీ నాయకులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జహీరాబాద్ ప్రాంతం నిమ్జ్ ప్రాజెక్టు రావడంతో అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం, జిల్లా మంత్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బుల్లెట్ రైలు స్టాప్ జహీరాబాద్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాల ప్రజల ఆశాంతిగా ఉన్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు.
పటాన్చెరు టౌన్: పటాన్చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థి అధ్యయన కేంద్రంలో 2026–27 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రవీణ తెలిపారు. ఇంటర్మీడియెట్, ఓపెన్ ఇంటర్, రెండేళ్ల ఐటీఐ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ప్రవేశాలకు అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఆగస్టు 7 వరకు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 7382929636 నంబర్లో సంప్రదించాలని సూచించారు.


