జిల్లా వైద్యాధికారి లలితాదేవి
సంగారెడ్డి: మాత, శిశువు ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ నియంత్రణ అధికారి నాగ నిర్మల, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
హత్నూర(సంగారెడ్డి): తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిజమైన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని హత్నూర మండల ఉద్యమకారుల సంఘం నాయకులు మంగళవారం ఉద్యమకారుల రాష్ట్ర గుర్తింపు కమిటీ చైర్మన్ కోదండరామ్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉద్యమకారుల మండల కమిటీ గౌరవ అధ్యక్షుడు చెన్న నరసింహులు, అధ్యక్షుడు బట్టు మారుతి రాజు, ప్రధాన కార్యదర్శి నరేందర్, ఉద్యమ మండల అప్పటి జేఏసీ కన్వీనర్ భోగయ్య , ఉద్యమ నాయకులు రాజీవ్ గాంధీ, నరసింహులు, రాజు, శ్రావణ్ కుమార్ గౌడ్, నజీర్, గౌసుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని చాల్కి చౌరస్తా వద్దనున్న ఆత్మలింగం ట్రేడర్స్ ఫర్టిలైజర్ దుకాణాన్ని మంగళవారం మండల వ్యవసాయ శాఖ అధికారి అభినాష్ వర్మ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సరిగ్గా 272 బస్తాల డీఏపీ ఎరువులు విక్రయాలకు సంబంధించి రికార్డుల్లో నమోదు చేయకపోవడం, బిల్లులు కూడా లేకపోవడంతో వారం రోజుల పాటు ఈ దుకాణంలో విక్రయాలు నిలివేశారు. ఈ మేరకు ఏఓ మంగళవారం మీడియాకు వెల్లడించారు. నిర్వహకుడికి షోకాజ్ నోటీస్ కూడా జారీ చేశారు.
మంత్రి దామోదరకు సీపీఎం రాజయ్య లేఖ
పటాన్చెరు టౌన్: పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యు డు రాజయ్య మంత్రి దామోదర రాజ నర్సింహకు మంగళవారం లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...భవనం, మౌలిక వసతులు పూర్తై ఏడాదికి పైగా గడిచినా ఆస్పత్రి ప్రారంభం కాకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పారిశ్రామిక ప్రమాదాలు, జాతీయ రహదారిపై జరిగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో చికిత్స అందక ప్రాణనష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే ఆస్పత్రిని ప్రారంభించి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
దరఖాస్తుల ఆహ్వానం
శివ్వంపేట(నర్సాపూర్): మండలంలోని గోమారం ప్రభుత్వ పాలిటెక్నిక్ బాలుర హాస్టల్ మెస్, మెయింటెన్స్కు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెండర్ దరఖాస్తులను కళాశాల నుంచి పొందవచ్చునని తెలిపారు. టెండర్దారులు తమ సీల్డ్ కవర్లను ఈనెల 21 మధ్యాహ్నం 2 గంటల్లోగా కళాశాల ప్రాంగణంలో గల టెండర్ బాక్స్లో వేయాలన్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు సీల్డ్ ఓపెనింగ్ చేసి తక్కువ టెండర్ వేసిన వారికి బాధ్యతలు అప్పగిస్తామన్నారు.


