కంగ్టి(నారాయణఖేడ్): మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, కస్తూర్బాగాంధీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు, అంగన్వాడీ కంగ్టి కేంద్రాన్ని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో డాక్టర్ నారాయణరావు, వైద్యాధికారి డాక్టర్ నాగమణి ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్లో భాగంగా నిర్వహిస్తున్న యోగా క్యాంప్ను పరిశీలించారు. ఆస్పత్రిలోని రిజిష్టర్లు, మందులు తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంటలు పరిశీలించారు. ఆయా పాఠశాలల్లో రికార్డులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శైలజా కులకర్ణి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
హత్నూర(సంగారెడ్డి): హత్నూర మండలం కాసాల గ్రామ శివారులో నిర్మిస్తున్న బ్లూ లియో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ యాజమాన్యానికి గ్రామ కార్యదర్శి స్వప్న శుక్రవారం నోటీసులు జారీ చేశారు. పరిశ్రమ నిర్మాణానికి పంచాయతీ తీర్మానాలు, అనుమతులు లేవని గ్రామ ప్రజలు ఆరోపిస్తూ ఇటీవల ప్రజావాణి కార్యక్రమంలో పరిశ్రమపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశ్రమ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయగా.. అక్కడ నిర్మాణాల పనులను నిలిపివేశారని, ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి అనుమతులు పొందిన తర్వాతనే నిర్మాణ పనులు చేపట్టాలని సూచించినట్లు స్వప్న వెల్లడించారు.
హత్నూర(సంగారెడ్డి): తెలంగాణ మోడల్ పాఠశాలల ప్రవేశ పరీక్ష ఈ నెల 19న జరగనుంది. ఈ మేరకు హత్నూర మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ భాస్కర్రెడ్డి శుక్రవారం తెలిపారు. తెలంగాణ మోడల్ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి (2026–27) ప్రవేశ పరీక్ష 19 ఏప్రిల్ (ఆదివారం) నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 6వ తరగతి: ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు: మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 4.00 వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఈనెల 10వ తేదీ నుంచి http://telanganams.cgg.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు.
తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల
వైస్ ప్రిన్సిపాల్ నిర్మల
సంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో చదువుతోపాటు అంతర్గత నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నిర్మల తెలిపారు. సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కళాశాలలో కంప్యూటర్, సైన్స్ విభాగాలకు సంబంధించి ప్రత్యేక ల్యాబోరేటరీ సదుపాయాలున్నాయని, టీఎస్ కేసీ ద్వారా ఆంగ్లభాష అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీశ్వర్, అధ్యాపకులు డాక్టర్ సరోజినీ చక్రవర్తి, డాక్టర్ సుజాత, డాక్టర్ సుచిత్రసింగ్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


