క్వింటాల్ ధర రూ.18 వేలు
● గ్రామాల్లో కిలోకు రూ.220 నుంచి 270 వరకు ధర
● పంట తీసే కూలీలకు కిలోకు రూ.15
మునిపల్లి(అందోల్): ఆరుతడి పంటల్లో భాగంగా రైతులు మిర్చి పంటను సాగు చేసి లాభాలు గడిస్తున్నారు. మిర్చి క్వింటాలుకు వరంగల్ మార్కెట్లో రూ.18 వేల చొప్పున ధర ఉంది. మండలంలోని ఆయా గ్రామాల్లో పంటను సాగు చేసిన రైతులు కొంత మంది లోకల్ మార్కెట్లో విక్రయించారు. ఇంకొందరు రైతులు మిర్చి కిలోకు రూ.220 నుంచి రూ. 270 చొప్పున గ్రామాల్లోనే అమ్ముతున్నారు. మిర్చి నాణ్యతను బట్టి రైతులు ధర పెంచుతున్నారు. పంట సాగు చేయడానికి రైతులు స్ప్రింకర్లు, పైపులైన్ సహకారంతో సరైన సమయంలో నీరు పారించి మంచి దిగుబడులు సాధిస్తున్నారు.
ఎకరాకు 30 క్వింటాళ్లు
మీర్చి పంటకు సరైన సమయంలో నీరందించి, మందులు పిచికారీ చేయడంతో ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన రైతు కిష్టయ్య తెలిపారు. రెండెకరాలకు గాను తెంపిన మిర్చి 70 క్వింటాళ్లు రాగా ఎండ బెట్టడంతో 30 క్వింటాళ్లకు తగ్గిందని పేర్కొన్నారు. మిరప పంట కోయడానికి కిలోకు రూ.15 చొప్పున కూలీలకు డబ్బులు చెల్లిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఒక్కో కూలీ రోజుకు 50 కిలోల నుంచి 60 కిలోల వరకు మిర్చి పంటను తెంపుతున్నారు. కాగా కూలీలకు మేలు చేకూరుతుండగా, రైతులకు మాత్రం ఎండబెట్టడంతో పంట సగానికి సగం బరువు తగ్గుతుందని వారు పేర్కొంటున్నారు.
లాభాలు వచ్చే పంటలు
రైతులు లాభాలు వచ్చే పంటలను సాగు చేయాలి. ముఖ్యంగా ఆరుతడి పంటల్లో ఎక్కువగా లాభాలు వస్తాయి. పంట సాగు చేసే సమయంలో అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.
– అనిత, మండల వ్యవసాయాధికారి
ఆరుతడి పంటలు మేలు
ఆరుతడి పంటలతోనే లాభం. ఖరీఫ్, రబీ సీజ్లో వర్షాలు ఎక్కువ పడినా, తక్కువ పడినా పంట దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆరుతడి పంటలైతే సరైన సమయంలో నీరందిస్తే సరిపోతుంది.
– జాఫర్ (రైతు)


