ప్రైవేట్ స్కూలులో అగ్నిప్రమాదం
సంగారెడ్డి టౌన్ : ప్రైవేట్ పాఠశాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన సంగారెడ్డి పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... పట్టణంలోని పోతిరెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్న శ్రద్ధా స్కూలులో ఉదయం మంటలు చెలరేగి భవనం మొత్తానికి వ్యాపించాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్కూలుకు సెలవు ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే భారీ ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. మంటలతో స్కూలులోని ఆఫీస్ రూమ్, విద్యార్థుల తరగతి గదులు, ఫర్నిచర్, పుస్తకాలు, ముఖ్యమైన రికార్డులు అగ్నికి ఆహుతయ్యాయి. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. గంటకు పైగా వారు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్లాస్టిక్ గోదాంలో...
పటాన్చెరు టౌన్: ప్లాస్టిక్ తుక్కు గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటన ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, జిల్లా ఫైర్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు వివరాల ప్రకారం... పట్టణంలోని ప్లాస్టిక్ గోదాంలో బుధవారం మధ్యాహ్నం ప్లాస్టిక్ వ్యర్థాలు తగలబడుతుండటంతో దాదాపు మూడు కిలోమీటర్ల మేర దట్టమైన పొగలు కనిపించాయి. స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాలేదని జిల్లా ఫైర్ ఆఫీసర్ తెలిపారు.


