వచ్చే నెల నుంచి నూతన పెన్షన్లు
మంత్రి గడ్డం వివేక్
సిద్దిపేటఅర్బన్: వచ్చే నెల నుంచి నూతన పెన్షన్లు ఇస్తామని సిద్దిపేట నియోజకవర్గానికి ఇచ్చే 3,500 ఇళ్లకు అదనంగా మరో 500 ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వనున్నట్టు రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ తెలిపారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎల్లుపల్లి, వెల్కటూరు, నాంచారుపల్లి గ్రామాలలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రూ. 2.30 కోట్లతో నిర్మించిన కేజీబీవీ నూతన భవనాన్ని ఎంపీ రఘునందన్రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం వెల్కటూరులో నిర్మాణం పూర్తైన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. మండలంలోని 10 గ్రామాలలో నిర్మించే సీసీ రోడ్లలో భాగంగా నాంచారుపల్లిలో శంకుస్థాపన చేశారు. గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. నాంచారుపల్లి గ్రామంలో వార్డు సభ్యులతో పాటు పలువురు మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, ఆర్డీవో సదానందం, డీఐఈవో రవీందర్రెడ్డి, డీఈవో శ్రీనివాస్రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, తహసీల్దార్ హరికిరణ్, ఎంపీడీవో మార్టిన్ లూథర్, ఏఈ శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు శ్రీనివాస్, నర్సింహారెడ్డి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ప్రొటోకాల్ రగడ..
మంత్రి వివేక్ పర్యటనలో భాగంగా నాంచారుపల్లిలో సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఫొటో లేకపోవడంతో ప్రొటోకాల్ వివాదం చెలరేగింది. ఫ్లెక్సీలో ఫొటో లేకపోవడంతో ఆంక్షారెడ్డి స్టేజీపైకి వెళ్లకుండా దూరంగా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఫొటో తొలగించారని ఆంక్షారెడ్డి అనుచరులు ఆగ్రహానికి లోనయ్యారు. దీనికి కారణం సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణనే కారణమని ఆంక్షారెడ్డి అనుచరుడు అతనిపై చేయిచేసుకున్నారు. దీంతో పక్కనే ఉన్న ఇతర నాయకులు సర్దిచెప్పి అక్కడి నుండి పంపించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.


