పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి హమీద్
ప్రశాంత్నగర్(సిద్దిపేట): గ్రూప్ –1, 2, 3, 4, ఆర్ఆర్బీ, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సీ తదితర పోటీ పరీక్షలకు స్థానిక టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఫౌండేషన్ కోర్సు ద్వారా 5 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి హమీద్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ నెల 30 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నామని, డిగ్రీ పూర్తి చేసి రూ.3 లక్షల లోపు ఆదాయం కలిగిన ఎస్సీ, బీసీ, ఎస్టీ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 8న ఎంట్రన్స్ పరీక్ష ఉంటుందని, మెరిట్ ఆధారంగా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి రెసిడెన్షియల్తో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు. వివరాలకు ఎస్సీ స్టడీ సర్కిల్ 91822 20112లో సంప్రదించాలన్నారు.
వినయ్ పవార్కు అవార్డు
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్కు చెందిన ఆల్ ఇండియా ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వినయ్ పవార్కు జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ ప్రైడ్ ఆఫ్ భారతరత్న అవార్డును ప్రదానం చేశారు. తెలంగాణ ప్రభుత్వ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న వినయ్ పవార్కు మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారి అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం చాంబర్ చైర్మన్ రామకృష్ణ గౌడ్, ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బాలుడితో పనులు..
దుకాణదారుడిపై కేసు
సంగారెడ్డి క్రైమ్: బాల కార్మికుడితో పని చేయిస్తున్న దుకాణదారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ఫరిధిలో చోటుచేసుకుంది. సీఐ రామానాయుడు వివరాల ప్రకారం... శాంతినగర్ కాలనీలోని పలు దుకాణాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బాల కార్మికుడిని పనిలో పెట్టుకొని అతడితో పని చేయిస్తున్నట్లు గుర్తించారు. ఆ యజమానిపై కేసు నమోదు చేసి, బాలుడిని బాలల సంరక్షణ గృహానికి తరలించారు.
కంటైనర్ను ఢీకొట్టిన కారు
● కారు డ్రైవర్కు స్వల్పగాయాలు
● బెలూన్ తెరుచుకోవడంతో
తప్పిన ప్రమాదం
మునిపల్లి(అందోల్): కంటైనర్ను కారు ఢీకొట్టిన ఘటనలో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. బుదేరా ఎస్ఐ రాజేశ్ నాయక్ వివరాల ప్రకారం... సోమవారం జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు డ్రైవర్ మద్యం మత్తులో ముందు వెళ్తున్న కంటైనర్ను ప్రక్క నుంచి ఢీకొట్టాడు. కారు బెలూన్ తెరుచుకోవడంతో కూకట్పల్లికి చెందిన కారు డ్రైవర్ కిశోర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అదే సమయంలో కారును తప్పించబోయి మరో భారీ కంటైనర్ రోడ్డు డివైడర్ను దాటి అవతల రోడ్డుపై నిలిచిపోయింది. కాగా రెండు వాహనాల డ్రైవర్లు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కంటైనర్, కారును జేసీబీతో రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ


