చిట్కుల్లో వక్ఫ్ భూముల సర్వే
చిలప్చెడ్(నర్సాపూర్): వక్ఫ్ భూమిలో ఓ ముస్లిం కుటుంబం ఇంటిని నిర్మించుకోవడం దుమారం లేపింది. దాంతో గ్రామంలోని పలువురు ముస్లింలు వక్ఫ్ బోర్డులో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మండలంలోని చిట్కుల్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... వక్ఫ్ భూమిలో ముస్లిం కుటుంబం నిర్మించుకుంటున్న ఇంటి బేస్మెంట్ను రెవెన్యూ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూల్చివేశారు. దాంతో సదరు కుటుంబ సభ్యుడు, గ్రామంలోని 49, 50, 163 సర్వేలో గల వక్ఫ్ భూమిలో నిర్మాణాలు జరిగాయని అధికారులకు ఫిర్యాదు చేయడంతో వక్ఫ్ సర్వే అధికారులు సోమవారం సర్వేకు వచ్చారు. విషయం తెలిసిన గ్రామస్తులు సర్వే చేయనివ్వమని, చాలా ఏళ్లుగా ఇక్కడే ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నామని.. అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వక్ఫ్ అధికారులు గ్రామస్తులకు నచ్చజెప్పారు. ప్రస్తుతం తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు సర్వేకు మాత్రమే వచ్చామని, హద్దులు మాత్రమే గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. గ్రామస్తులు ఇబ్బందులు ఉండవని వక్ఫ్ ఇన్స్పెక్టర్ సాబేర్ హుస్సేన్ తెలపడంతో సర్వేకు అంగీకరించారు. అనంతరం రెవెన్యూ అధికారుల సహాయంతో వక్ఫ్ అధికారులు సర్వే చేశారు. కాగా పంచనామా పత్రంపై సంతకాలు చేసేందుకు గ్రామస్తులు నిరాకరించడంతో అధికారులు వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ సర్వేయర్ షుజాత్ అలీఖాన్, తహసీల్దార్ సహాదేవ్, ఆర్ఐ సునీల్సింగ్, ఇన్చార్జి సర్వేయర్ అభిలాష్, కార్యదర్శి తిరుపతి, జీపీఓ రాధాకృష్ణ, సర్పంచ్ రాములు, ఉప సర్పంచ్ అఖిల్, గ్రామస్తులు పాల్గొన్నారు.
సర్వే చేయొద్దని గ్రామస్తుల వాగ్వాదం
హద్దులు మాత్రమే
గుర్తిస్తాం: వక్ఫ్ ఇన్స్పెక్టర్
చిట్కుల్లో వక్ఫ్ భూముల సర్వే


