అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
పటాన్చెరు టౌన్: అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేసి, 92 కిలోలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం పటాన్చెరు పోలీస్స్టేషన్లో రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి మహారాష్ట్రకు ఓఆర్ఆర్ మీదుగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం వచ్చింది. దీంతో పటాన్చెరు, ఎస్ఓటీ పోలీసులు ఆదివారం సాయంత్రం ముత్తంగి డివిజన్ పరిధిలోని టోల్ ప్లాజా సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు వాహనాలను తనిఖీ చేశారు.92 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, మహారాష్ట్ర, సోలాపూర్కు చెందిన సచిన్ గంగారాం మారుతి చవాన్, మహేశ్ రవీంద్ర, విజయ్ చవాన్లను అరెస్టు చేశారు. గంజాయి విలువ సుమారు రూ. 46 లక్షలు ఉంటుందని తెలిపారు. విచారణలో గంజాయిని ఒడిశాలోని పరలా ఖేముడి ప్రాంతానికి చెందిన జాఫర్ సరఫరా చేస్తుండగా, మహారాష్ట్ర సోలాపూర్కు చెందిన అజిత్ తరలిస్తున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. పట్టుబడిన ముగ్గురిని రిమాండ్కు తరలించారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీసులను సైబరాబాద్ సీపీ అభినందించారు. సమావేశంలో సీఐ వినాయక్ రెడ్డి , క్రైమ్ సీఐ రాజు, ఎస్ఐలు ఆసిఫ్ అలీ, మహేశ్వర్ రెడ్డి, రాజు, ఎస్ఓటీ పోలీసులు పాల్గొన్నారు.
92 కిలోల గంజాయి స్వాధీనం
ముగ్గురు నిందితుల రిమాండ్


