ఆత్మహత్యలు వద్దు.. ఆదుకుంటాం
నంగునూరు(సిద్దిపేట): అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి మనసు కలిచివేసిందని, ఎవరు అఘాయిత్యాలకు పాల్పడవద్దని రోడ్డు భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా ఘణపూర్లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఎల్ల రాజిరెడ్డి కుటుంబ సభ్యులను సోమవారం మంత్రి పరామర్శించారు. అనంతరం వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. అప్పుల పేరిట రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. తమది పేదల ప్రభుత్వమని, ఇందిరమ్మ రాజ్యం అనే ఆలోచనతో ముందుకు సాగుతున్నామన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.16 వందల కోట్ల ఎల్ఓసీ అందజేయగా, తాను రూ.20 కోట్లు ఇప్పించానన్నారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు పెంచామని, ఎవ్వరూ అధైర్య పడొద్దన్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకునేలా చూడాలని ఆర్డీఓ సదానందంను ఆదేశించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి తోపాటు అదే గ్రామానికి చెందిన ఎల్ల రాములు కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున అందజేశారు. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
బాధిత కుటుంబాలకు భరోసా


