ఆలయాల పరిరక్షణకు కేంద్రం కృషి
● ఎంపీ రఘునందన్రావు ● కూడవెల్లి జాతర ఏర్పాట్ల పరిశీలన
దుబ్బాక: దేశంలో ఆలయాల పరిరక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. ఆదివారం అక్భర్పేట–భూంపల్లి మండలంలోని కూడవెల్లి రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దక్షిణకాశీగా ప్రసిద్ధి గాంచిన కూడవెల్లి జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. దేశంలో ప్రఖ్యాతి గాంచిన శివాలయాలను పునరుద్ధరించడంతో పాటు భక్తుల సౌకర్యార్థం వసతులు సమకూరుస్తామన్నారు. ఆలయాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్లు భానుప్రసాద్, ఆలయ ప్రధాన అర్చకులు సాకేత్శర్మ తదితరులు ఉన్నారు.
బ్యాట్ పట్టి.. బంతిని కొట్టి..
మిరుదొడ్డి(దుబ్బాక): నైపుణ్య యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మిరుదొడ్డిలో జరిగిన ఐఎంసీ ఐపీఎల్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ను మెదక్ ఎంపీ రఘునందన్రావు తిలకించారు. ఆటవిడుపుగా క్రికెట్ బ్యాట్ పట్టి బంతులను పరుగులు పెట్టిస్తూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. దీంతో క్రీడాకారులు, క్రీడాభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు.


