సింగూరు.. రిపేరు
రెచ్చిపోతున్న కబ్జాకోరులు అమీన్పూర్లో కబ్జాకోరులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇళ్లు నిర్మిస్తున్నారు. వివరాలు IIలో u
న్యూస్రీల్
517 మీటర్లకు తగ్గించనున్న నీటిమట్టం ఒకటీ రెండు రోజుల్లో ప్రాజెక్టునీటి విడుదల కలెక్టర్ అనుమతి కోరిననీటిపారుదలశాఖ
శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026
కట్ట బలోపేతం దిశగా మొదలైన రివీట్మెంట్ పనులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : సింగూరు ఆనకట్ట మరమ్మతు పనులు షురూవయ్యాయి. ప్రస్తుతానికి కట్టకు ఇరువైపులా చివరలో రివీట్మెంట్ పనులు చేపట్టారు. ప్రాజెక్టులో నీటి మట్టం 520 (16.5 టీఎంసీలు) మీటర్ల మేర ఉండటంతో కట్ట దెబ్బతిన్న ప్రదేశంలో రివీట్మెంట్ పనులు చేసేందుకు వీలు పడటం లేదు. దీంతో చివరిభాగంలో ఈ పనులను ప్రారంభించారు. హైదరాబాద్తోపాటు, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు తాగు నీరు, ఉమ్మడి మెదక్ జిల్లాకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ఆనకట్ట పూర్తిగా దెబ్బతిన్నదని డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. తక్షణం ఈ మరమ్మతులు చేపట్టకపోతే ప్రాజెక్టు తెగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇదే జరిగితే సుమారు 12 గ్రామాలు కొట్టుకుపోతాయని, ప్రాణ, ఆస్తి నష్టం భారీగా ఉంటుందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మరమ్మతులపై దృష్టి సారించింది. తీవ్ర తర్జన భర్జనల మధ్య ఈ ప్రాజెక్టును ఖాళీ చేసి మరమ్మతులు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందులోభాగంగా ఈ కట్ట మరమ్మతు పనులు జరుగుతున్నాయి. రివీట్మెంట్తోపాటు, రాతికట్టడాల పనులు చేస్తున్నారు. ఈ పనుల కోసం ఇప్పటికే రూ.16 కోట్ల నిధులు మంజూరైన విషయం విదితమే. పరిపాలన వ్యయం పోగా సుమారు రూ.13 కోట్లకు ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టు కంపెనీతో ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఈ కాంట్రాక్టు కంపెనీ పనులను ప్రారంభించింది.
వచ్చే సీజనులో డెడ్ స్టోరేజీకి నీటి మట్టం..
ఈ జలాశయం ఆనకట్టతోపాటు, ప్రాజెక్టు ఆఫ్రాన్ కూడా దెబ్బతింది. గేట్లు కూడా మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. తరచూ గేట్లు మొరాయిస్తున్నాయి. గేట్లకు పెయింటింగ్ పనులు కూడా చేయాల్సి ఉంది. ఈ పనులు వచ్చే సీజనులో ప్రారంభిస్తామని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వచ్చే సీజను ప్రాజెక్టు నీటి మట్టాన్ని డెడ్స్టోరేజీకి నీటిమట్టాన్ని తగ్గించాలని నిర్ణయించారు. డెడ్స్టోరేజీకి తగ్గించాక పూర్తిస్థాయిలో కట్ట రివీట్మెంట్ పనులతోపాటు, ఆఫ్రాన్ పనులు కూడా చేసేందుకు వీలు పడుతుందని అధికారులు చెబుతున్నారు.
సింగూరు ప్రాజెక్టులో జరుగుతున్న
రివీట్మెంట్ పనులను పరిశీలిస్తున్న అధికారులు
నీటి విడుదలకు కలెక్టర్ అనుమతి
ప్రాజెక్టు నీటి మట్టాన్ని 520 మీటర్ల నుంచి 517 మీటర్ల (8.1 టీఎంసీ)కు తగ్గిస్తే ఈ సీజనులో కొంత మేరకు కట్ట బలోపేతం పనులు చేసేందుకు వీలుంటుంది. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి నీటిని వదిలేయాలని నిర్ణయించారు. హైదరాబాద్తోపాటు, సంగారెడ్డి, మెదక్ జిల్లాల తాగునీటి అవసరాల కోసం 8.1 టీఎంసీలకు తగ్గించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆది లేదా సోమవారం గానీ ప్రాజెక్టు నుంచి నాలుగు వేల క్యూసెక్కుల నుంచి ఐదు వేల క్యూసెక్కు నీటి విడుదల ఉంటుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నీటిని వదిలేందుకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతి రాగా, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అనుమతి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఒకటీ రెండో రోజుల్లో నీటిని వదులుతాం
సింగూరు ప్రాజెక్టు ఆనకట్ట బలోపేతం పనులు ప్రారంభించాం. నీటి మట్టాన్ని 520 మీటర్ల నుంచి 517కు తగ్గిస్తాం. ఇందుకోసం ఒకటీ రెండు రోజుల్లో ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు వదిలేస్తాం. ఇందుకోసం జిల్లా కలెక్టర్ అనుమతి కూడా తీసుకున్నాం. నీటిని విడుదల చేస్తున్నందున ప్రాజెక్టు దిగువన ఉన్న రైతులు, పశువుల కాపరులు మంజీరా నదివైపు వెళ్లకుండా చాటింపు వేయిస్తాం. ఈ సీజనులో ఈ మరమ్మతు పనులు వీలైనంత మేర జరిగేలా చర్యలు చేపట్టాం.
– శ్రీనివాస్,
చీఫ్ ఇంజనీర్, నీటిపారుదలశాఖ
సింగూరు.. రిపేరు


