ఆస్తి కోసమే అత్త హత్య
కేసు వివరాలు వెల్లడిస్తున్న గజ్వేల్ ఏసీపీ నర్సింహులు
కొండపాక(గజ్వేల్): ఆస్తి కోసం అత్తను హత్య చేసిన ఘటనలో అల్లుడితో పాటు సహకరించిన ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం కుకునూరుపల్లి పోలీస్టేషన్లో తొగుట సీఐ లతీఫ్తో కలిసి గజ్వేల్ ఏసీపీ నర్సింహులు కేసు వివరాలు వెల్లడించారు. మృతురాలు రాములమ్మ భర్త నర్సింహా రెడ్డి 2020లో చనిపోగా హోటల్ను నడుపుతూ ఇద్దరు కూతుళ్ల పెళ్లి చేశారు. పెద్ద కూతురు కుటుంబానికి ఆమె ఆర్థికంగా అండగా ఉంటుండగా, చిన్న కూతురు కుటుంబాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ములుగు మండలంలోని తున్కి బొల్లారానికి చెందిన చిన్న కూతురు భర్త జీవన్రెడ్డి కూలీ పనులు చేస్తున్నాడు. కుటుంబ పోషణ భారంగా మారడంతో ఎలాగైనా అత్త ఆస్తిని కాజేయాలని పథకం రచించాడు. ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న సలీంకు విషయం చెప్పి, హత్యకు సహకరిస్తే డబ్బు ఇస్తానన్నాడు. దీనికి అతడు ఒప్పుకోవడంతోపాటు స్నేహితుడు పాండుతో పాటు మరో ఇద్దరిని జీవన్రెడ్డికి పరిచయం చేశాడు. ఈనెల 6న మధ్యాహ్నం రెండు బైక్లపై నలుగురు హోటల్ వద్దకు వెళ్లారు. అందులో ముందుగా జీవన్రెడ్డితో పాటు పాండు లోపలికి వెళ్లగా అల్లుడికి చాయ్ ఇచ్చేందుకు రాములమ్మ లోపలికి వెళ్లింది. పథకం ప్రకారం కృష్ణ, మహేశ్ లోపలికి వెళ్లి వెంట తెచ్చుకున్న టవల్తో ఆమె మెడ చుట్టూ గట్టిగా బిగించగా, అక్కడే ఉన్న అల్లుడు, పాండు హత్య చేశారు. ఈ సమయంలో టీ కోసం వచ్చిన వ్యక్తి డోర్ మూసి ఉండటంతో రాములమ్మ అని పిలువగా నిందితులు వెనుకనుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న సీఐ లతీఫ్, ఎస్సై శ్రీనివాస్ ఘటనా స్థలికి చేరుకొని సీసీ ఫుటేజీలను పరిశీలించి చిన్నల్లుడు జీవన్రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా తనతో పాటు మరో ముగ్గురుతో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. జీవన్రెడ్డితో పాటు పాండురంగ, గజ్జెల మహేశ్, బిల్లాడి క్రిష్ణ, మహమ్మద్ సలీం, కై ర సత్యనారాయణ, నక్క నరేశ్ గౌడ్, కుంభ లక్ష్మణ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుంచి 3 ద్విచక్ర వాహనాలు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీనివాస్, పోలీసులు పాల్గొన్నారు.


