కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
హవేళిఘణాపూర్(మెదక్): కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్ మండల పరిధిలోని మగ్దూంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా... గ్రామానికి చెందిన మల్లేశంతో చిన్నశంకరంపేటకు చెందిన రేణుక(36)కు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు. కాగా భార్యాభర్తల మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ కలహాలు తాళలేక ఆమె శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుంది. కాగా తమ కూతురు ఆత్మహత్యకు భర్త, అత్త కారణమని, అదనపు కట్నం కోసం వేధించడంతోనే చనిపోయిందని మృతురాలు కుటుంబీకులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
హవేళిఘణాపూర్(మెదక్): విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని జక్కన్నపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన శీల నాగయ్య(45) తనకున్న పొలంలో సాగు చేసేందుకు ఉదయం మోటార్కు విద్యుత్ సరఫరా కాకపోవడంతో డబ్బా వద్ద రిపేరు చేస్తున్నాడు. ఈ క్రమంలో కరెంటు షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన గ్రామస్తులు కుటుంబీకులకు సమాచారం అందించగా వారు వెళ్లి చూసేలోపే ప్రాణాలొదిలాడు. ఎస్ఐ సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
చిన్నశంకరంపేట(మెదక్): గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ సృజన కథనం మేరకు...వల్లూర్ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వ్యక్తి కొంతకాలంగా సంచరిస్తున్నాడు. ఎవరైనా పెట్టింది తిని రహదారిపై ఎక్కడ పడితే అక్కడ నిద్రించేవాడని తెలిపారు. అయితే శుక్రవారం ఉదయం పొలం పనులకు వెళ్తున్న రైతులు హెచ్పీ పెట్రోల్పంప్ సమీపంలో మృతి చెందిన వ్యక్తిని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని రామాయంపేట మార్చురీకి తరలించారు.


