ఆర్ఎంపీ నిర్వాకం
● మళ్లీ యథాతథంగా చికిత్సలు ● చోద్యం చూస్తున్న అధికారులు
కొండపాక(గజ్వేల్): గతంలో ఆస్పత్రిని సీజ్ చేసినా ఓ ఆర్ఎంపీ మళ్లీ యథాతథంగా వైద్యం చేస్తున్నాడు. వివరాలు ఇలా... గజ్వేల్ పట్టణానికి చెందిన ఆర్ఎంపీ సుదర్శన్ కుకునూరుపల్లిలో సుదర్శన్ హాస్పిటల్ అని పేరుపెట్టుకొని కొన్నేళ్లుగా చికిత్స చేస్తున్నాడు. కాగా 2025 ఆగస్టులో జగదేవ్పూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థి తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి రాగా అత్యవసర వైద్యం అందించడంతో అతడు మృతి చెందాడు. కలెక్టర్ ఆదేశాల మేరకు గజ్వేల్ డివిజన్ డిప్యూటీ వైద్యాధికారి శ్రీనివాస్ హాస్పిటల్ను సీజ్ చేసి ఆర్ఎంపీపై ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయినా ఆస్పత్రి వెనక నుంచి చికిత్స చేస్తుండటంతో జిల్లా వైద్యాధికారి ధన్రాజ్ ఆస్పత్రిని సీజ్ చేయించారు. సీజ్ను తొలగించాలని, యజమాని నుంచి ఒత్తిడి పెరిగిందని.. ఎలాంటి వైద్యం చేయనని ఆర్ఎంపీ కలెక్టర్కు దరఖాస్తు చేశాడు. దీంతో అద్దె కోసం భవనాన్ని ఇవ్వకూడదంటూ కొన్ని ఆంక్షలతో డిప్యూటీ వైద్యాధికారి సీజ్ను తొలగించారు. ఈ నేపథ్యంలో సూర్య మెడికల్ హాల్ పేరిట మునుపటి అద్దె భవనంలోనే ఆర్ఎంపీ సుదర్శన్ వైద్య పరీక్షలు చేస్తుండగా శుక్రవారం సాక్షి క్లిక్మనిపించింది. ఈ విషయమై జిల్లా వైద్యాధికారిని వివరణ కోరగా... ఆర్ఎంపీ తీరుపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు.


