రుణం ఇప్పిస్తానని మోసం
నర్సాపూర్: బ్యాంకు నుంచి రుణం ఇప్పిస్తానని ఓ మోసగాడు రైతు నుంచి సెల్ఫోన్, రూ. 3 వేలు కాజేశాడు. చిలప్చెడ్ మండలం అంతారం గ్రామానికి చెందిన రైతు సాయిలు గురువారం పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో తన రుణానికి సంబంధించిన వాయిదా చెల్లించేందుకు వెళ్లాడు. రూ. 9 వేల వాయిదా చెల్లించాల్సి ఉండగా, తన వద్ద ఉన్న రూ. 3 వేలు చెల్లించి మిగిలిన సొమ్ముకు గడువు కోరాలని భావించాడు. అయితే బ్యాంకులో ఒక వ్యక్తి తన పేరు మల్లేశం అని, బ్యాంకు అధికారులతో పరిచయం ఉందని సాయిలును నమ్మించాడు. కావాల్సిన సహాయం చేస్తానని నమ్మబలికాడు. మాట్లాడుకుందామని జాతీయ రహదారిపై ఉన్న హోటల్ వద్దకు తీసుకెళ్లాడు. కావాల్సిన రూ. 6 వేలు ఇస్తానని, బ్యాంకు అధికారులు తనకు తెలుసని, నీ వద్ద ఉన్న రూ. 3 వేలు ఇస్తే మిగిలిన ఆరు వేలు తాను కలిపి బ్యాంకులో చెల్లిస్తానని చెప్పాడు. మళ్లీ రుణం సైతం ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో రైతు తన వద్ద ఉన్న రూ. 3 వేలతో పాటు సెల్ఫోన్ సైతం ఇచ్చాడు. అనంతరం రైతుకు రూ. 500 ఇచ్చి మద్యం తీసుకురమ్మని పంపించాడు. అతడు మద్యం తీసుకొని వచ్చే సరికి ఆగంతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తనకు న్యాయం చేయాలని రైతు అధికారులను కోరాడు. ఈ విషయమై ఎస్ఐ రంజిత్రెడ్డి వద్ద ప్రస్తావించగా తమ దృష్టికి రాలేదని చెప్పారు.


