అల్పాహారం 19 రోజులే
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇప్పటి నుంచైనా అందించాలనికోరుతున్న విద్యార్థులు
న్యాల్కల్(జహీరాబాద్)/నారాయణఖేడ్: ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులకు ఉపశమనం లభించింది. పది విద్యార్థులకు ఫిబ్రవరి 16 నుంచి అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా సదరు విద్యార్థులకు అల్పాహారాన్ని సైతం ప్రభుత్వం ఇంతవరకు అందించలేకపోయింది. దీంతో ఉపాధ్యాయులు చెప్పిన చదువులు ఒంటబట్టడం లేదని, అల్పాహారం అందించాలని విద్యార్థులు కోరుతూ వచ్చారు. ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం వచ్చే నెల 16 నుంచి మార్చి 10 వరకు అల్పాహారాన్ని అందించాలని ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈసారి 12,394 మంది
జిల్లాలో 249 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. వాటిల్లో 12,394 మంది విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నారు. ఈసారి అక్టోబర్ 7 నుంచే టెన్త్ విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ ప్రారంభించింది. రెగ్యులర్ తరగతులతోపాటు ప్రతీ రోజు సాయంత్రం 4.15 గంటల నుంచి 5.15 గంటల వరకు గంట పాటు డిసెంబర్ వరకు ఒక పూట మాత్రమే ప్రత్యేక తరగతులు కొనసాగగా, జనవరి 1 నుంచి 52 రోజుల ప్రణాళికలు తయారు చేసిన ప్రభుత్వం ఉదయం, సాయంత్రం రెండు పూటలా ప్రత్యేక తరగతులు ప్రారంభించింది. ఇంతవరకు బాగానే ఉన్నా దూర ప్రాంతాల నుంచి పొద్దునే వచ్చే విద్యార్థులు ఆకలితో ప్రత్యేక తరగతులకు హాజరవుతూ ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో అధ్యాపకులు స్వచ్చంద సంస్థలు, దాతల సహకారంతో అరకొరగా స్నాక్స్ సదుపాయాలు కల్పించారు. అయితే కనీసం బిస్కెట్లు, పాలు అందించాలని విద్యార్థులు కోరుతున్నారు.
డిసెంబర్ నుంచే కోరినా..
ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10వ తేదీ వరకు కేవలం 19 రోజులు మాత్రమే అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గత డిసెంబర్ నుంచి అల్పాహారం అందించాలని విద్యాశాఖ ఆర్థిక శాఖను కోరగా కేవలం 19 రోజులకే అల్పాహారం అందించేందుకు ఆర్థికశాఖ అనుమతించినట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15లు చొప్పున రూ.285 అందించనుంది. ఈ లెక్కన జిల్లాలోని12,394 మంది విద్యార్థులకు సంబంధించి రూ.35,32,290లు నిధులు విడుదల చేసింది.
పోషక విలువలతో చిరుతిళ్లు
విద్యార్థులకు ఉడకబెట్టిన పెసలు, బొబ్బర్లు లేదా శనగలు, పల్లీలు, బెల్లం వంటి పోషకాలతో చేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఉల్లిపాయ పకోడి వంటివి రోజుకు ఒక్కోరకం చొప్పున విద్యార్థులకు అందించేందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చ
ఇప్పటి నుంచైనా అందిస్తే బాగుండేది
ఫిబ్రవరి 16 నుంచి కాకుండా కనీసం ఇప్పటినుంచైనా అల్పాహారం అందిస్తే దూరప్రాంతాల నుంచి వచ్చే తమలాంటి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడేది. పొద్దునే ఇంటి నుంచి తినకుండా వస్తున్నాం. ఉదయం, సాయంత్రం సమయంలో టీచర్లు చెప్పే పాఠాలు సక్రమంగా అర్థం కావాలంటే స్నాక్స్ను ఇప్పటినుంచే అందించాలి.
సాజీద్, విద్యార్థి, న్యాల్కల్
ఫిబ్రవరి నుంచి అల్పాహారం
ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున జిల్లాలోని 12,394 మంది పది విద్యార్థులకు రూ.35,32,290 విడుదల చేసింది.
వెంకటేశ్వర్లు, డీఈఓ, సంగారెడ్డి
టెన్త్ ప్రత్యేక తరగతులకుహాజరయ్యే విద్యార్థులకు..


