ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
● టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి ● ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ
సంగారెడ్డి జోన్: ప్రమాదాల నివారణ అందరి బాధ్యతని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవంలో భాగంగా గురువారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ బైక్ షోరూంల ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ర్యాలీని నిర్మలారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రతీ ఒక్కరు రోడ్డు భద్రత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా రవాణ అధికారి అరుణ మాట్లాడుతూ...రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా రోడ్డు భద్రతపై విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ సత్తయ్య గౌడ్, రవాణ శాఖ సభ్యులు తాహెర్, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


