439 వీఓ భవనాలు
జిల్లా వ్యాప్తంగా నిర్మాణానికి కసరత్తు
● కేంద్ర నిధులతో ఊరూరా పక్కా భవనాలు ● మార్చిలోపు పూర్తి చేయాలని గడువు
నంగునూరు(సిద్దిపేట): డ్వాక్రా గ్రూపుల ద్వారా ఆర్థిక లావాదేవీలు సాగిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్న గ్రామీణ మహిళలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. స్వయం సహాయక గ్రూపు సభ్యులకు ఊరూరా పక్కా భవనాలు నిర్మించాలనే సంకల్పంతో నిధులు మంజూరు చేసింది. మహిళాశక్తి పథకం కింద ఎమ్జీ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విలేజ్ ఆర్గనైజేషన్ (వీఓ) గ్రూపులకు సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. మార్చి నెలాఖరు నాటికి భవనాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు కసరత్తు ప్రారంభించారు.
సిద్దిపేట జిల్లాలోని 477 గ్రామ పంచాయతీలకు గాను 18,513 స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు కాగా 1,96,117 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. గ్రామ సమైఖ్యలోని 20 నుంచి 25 గ్రూపులను విభజించి వీఓలను ఏర్పాటు చేశారు. గ్రూపునకు సంబంధించిన లావాదేవీలను ఏపీఎం, సీసీల పర్యవేక్షణలో సీఏలు నిర్వహిస్తున్నారు. ప్రతి నెల 10న నిర్వహించే సమావేశాలకు చాలా గ్రామాల్లో సొంత భవనాలు లేక పోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పక్కా భవనాలు మంజూరు
జిల్లా వ్యాప్తంగా 726 వీఓలు ఉండగా కేవలం 287 సొంత భవనాలు మాత్రమే ఉన్నాయి. ప్రతి నెల నిర్వహించే సమావేశాలకు పెద్ద ఎత్తున వచ్చే సభ్యులకు స్థలం లేకపోవడంతో విడుతల వారీగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎమ్జీ ఎన్ఆర్ఈజీఎస్ (మహాత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం) కింద ప్రతి గ్రామంలో వీఓ భవన నిర్మాణం కోసం రూ 10 లక్షలు మంజూరు చేసింది. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ ద్వారా మొత్తం 439 భవనాలు నిర్మించాల్సి ఉండగా.. 219 నిర్మాణాలకు అనువైన స్థలం లభించింది. మార్చి నెలాఖరు వరకు నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉండగా.. ఇంకా 220 భవనాలకు స్థలాలను గుర్తించాల్సి ఉంది.
భవనానికి స్థల దాతల పేర్లు
భవన నిర్మాణం కోసం గ్రామైఖ్య సంఘాలు తీర్మానం చేసి గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆమోదంతో 250 గజాల అనువైన స్థలాన్ని గుర్తించి ఎంపీడీఓలకు అందజేయాల్సి ఉంటుంది. సెర్ప్, ఎన్ఆర్ఈజీఎస్ అధికారుల ఆమోదంతో డీఆర్డీఓ పర్యవేక్షణలో కలెక్టర్ అనుమతి లభించగానే భవన నిర్మాణాలు చేపడుతారు. గ్రామ కంఠంలో అనువైన స్థలం దొరుకక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దాతలు ముందుకు వచ్చి స్థలం ఇస్తే భవనానికి వారి పేర్లు పెడుతామని అధికారులు పేర్కొంటున్నారు.
లక్ష్యం పూర్తి చేస్తాం
ఎమ్జీ ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద జిల్లా వ్యాప్తంగా వీఓ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. నూతనంగా ఎన్నికై న సర్పంచ్ల సహకారంతో ఈజీఎస్, సెర్ప్ అధికారుల సమన్వయంతో అనువైన స్థలాన్ని గుర్తిస్తున్నాం. కలెక్టర్ అనుమతితో త్వరగా నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. – డీఆర్డీఓ జయదేవ్ఆర్యా
439 వీఓ భవనాలు


