వందశాతం ఫలితాలు సాధించాలి
కౌడిపల్లి(నర్సాపూర్): ఉపాధ్యాయులు, విద్యార్థులు సమష్టిగా కృషి చేసి వందశాతం ఫలితాలు సాధించాలని ఎంజేపీ సొసైటీ ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్సీఓ రాజేశం అన్నారు. బుధవారం మండలంలోని తునికి వద్ద గల ఎంజేపీ గురుకుల పాఠశాల, కళాశాలను తనిఖీ చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా మాట్లాడారు. ఉపాధ్యాయులు అంకితభావంతో విద్యాబోధన చేయాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్లో వందశాతం ఫలితాలు సాధించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదవాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరిబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులు కష్టపడి చదవాలి
పెద్దశంకరంపేట(మెదక్): విద్యార్థులు కష్టపడి చదివితేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి మాధవి అన్నారు. బుధవారం పెద్దశంకరంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆమె తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థులు పరీక్షలు, ప్రాక్టికల్స్పై అవగాహన పెంచుకోవాలని, భయాందోళనకు గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. అలాగే ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆమె వెంట ప్రిన్సిపాల్ శోభారాణి, లెక్చరర్లు అనంతరాజశర్మ, ప్రభాకర్, హరిత, రాజు, మల్లేషం, శ్రీశైలం, జహీరాబేగం ఉన్నారు.
సీసీ కెమెరాలతో
నేరాల అదుపు
నర్సాపూర్ రూరల్: ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు సీసీ కెమెరాలు అందజేయడం అభినందనీయమని ఎస్సై రంజిత్కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని 2వ వార్డు ఇన్చార్జి, యువజన కాంగ్రెస్ నాయకుడు అంతారం సుధీర్గౌడ్ రూ. 80 వేలు విలువ చేసే సీసీ కెమెరాలను అందజేశారు. ఇటీవల 2వ వార్డులోని పలు ఇళ్లలో దొంగతనాలు జరిగి, నగదు బంగారం ఎత్తుకెళ్లారు. వార్డులో సీసీ కెమెరాలు ఉంటే దొంగల ఆచూకీ తెలిసేదన్నారు. విషయం తెలుసుకున్న సుధీర్గౌడ్ సొంత నిధులతో కెమెరాలు ఇవ్వడంతో పాటు వాటిని బిగించే పనులు చేయిస్తున్నాడని ఎస్సై కొనియాడారు.
కొండపోచమ్మ హుండీ రూ.7.18 లక్షలు
గజ్వేల్: జగదేవ్పూర్ మండలం తీగుల్ నర్సాపూర్లోని కొండపోచమ్మ ఆలయానికి హుండీ ద్వారా రూ.7.18లక్షల ఆదాయం సమకూరింది. బుధవారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. అమ్మవారికి 88 రోజులకు గాను ఈ ఆదాయం లభించిందని దేవాదాయ శాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఆలయ ఈఓ రవికుమార్ తెలిపారు. మరోవారంలో జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ తాజా మాజీ చైర్మన్ అనుగీత, సర్పంచ్ సంధ్య తదితరులు పాల్గొన్నారు.
వందశాతం ఫలితాలు సాధించాలి
వందశాతం ఫలితాలు సాధించాలి
వందశాతం ఫలితాలు సాధించాలి


