సమయపాలన పాటించని టీచర్లు
చిన్నశంకరంపేట(మెదక్): సర్కార్ బడుల్లో టీచర్ల సమయపాలనను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎఫ్ఆర్ఎస్ సిస్టం ప్రవేశపెట్టింది. అయినా టీచర్లలో మార్పు రావడం లేదు. తమ ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నారు. బుధవారం చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి ఉన్నత పాఠశాలలో ప్రార్థన సమయానికి ముగ్గురు టీచర్లు మాత్రమే హాజరు కాగా, ఇన్చార్జి ఎంఈఓ, పాఠశాల హెచ్ఎంతో పాటు మరో ఏడుగురు ఉపాధ్యాయులు గైర్హాజరయ్యారు. ఉపాధ్యాయులు హైదరాబాద్ నుంచి రైలులో రాకపోకలు సాగిస్తుండడంతో రైలు లేటు అయినప్పుడల్లా పాఠశాలకు లేట్గా రావడం పరిపాటిగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఎఫ్ఆర్ఎస్ వచ్చిన తర్వాత స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈఓలు, డీఈఓలు పర్యవేక్షణకు దూరమై.. కార్యాలయాలకే పరిమితం అవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ విషయంపై ఇన్చార్జి ఎంఈఓ, పాఠశాల హెచ్ఎం పుష్పవేణి మాట్లాడుతూ.. పాఠశాలకు ఉపాధ్యాయులు అలస్యమైనప్పుడు సీఎల్ వేస్తున్నట్లు తెలిపారు. తాను రామాయంపేటలో పని ఉండండతో వెళ్లినట్లు తెలిపారు.


