ఏసీపీ కార్యాలయం ఏర్పాటు చేయండి
సైబరాబాద్ పోలీస్ కమిషనర్రమేశ్రెడ్డిని కోరిన ఎమ్మెల్యే గూడెం
పటాన్చెరు టౌన్: పటాన్చెరు డివిజన్ పరిధిలో పరిపాలన సౌలభ్యం, ప్రజల అవసరాలకనుగుణంగా నూతన ఏసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సైబరాబాద్ కమిషనర్ రమేశ్రెడ్డిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఉదయం రమేశ్రెడ్డితో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పటాన్చెరు నియోజకవర్గ కేంద్రంగా పనిచేయాల్సిన ఏసీపీ కార్యాలయాన్ని ఆర్సీపురం కేంద్రంగా ఏర్పాటు చేశారని దీంతో స్థానిక ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు. పటాన్చెరులో అధునాతన సౌకర్యాలతో డీఎస్పీ భవన నిర్మాణ పనులకు ఇటీవలే శంకుస్థాపన చేశామని..పనులు సైతం ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ నూతన భవనంలోనే పటాన్చెరు ఏసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కొల్లూరు పోలీస్స్టేషన్ను నార్సింగి ఏసీపీ కార్యాలయం పరిధిలోకి చేర్చారని, రామచంద్రపురం ఏసీపీ పరిధిలోని చందానగర్ పోలీస్స్టేషన్కు బదులుగా కొల్లూరు పోలీస్స్టేషన్ను చేర్చాలని కోరారు. దీని మూలంగా పరిపాలనా పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని తెలిపారు. పటాన్చెరు కేంద్రంగా పనిచేసిన ట్రాఫిక్ పోలీస్స్టేషన్ విభజన ప్రక్రియలో ఇస్నాపూర్ పరిధిలోకి వెళ్లిందని దీనిని వెనక్కి తీసుకుని నూతన ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు రమేశ్రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.


