చిరుత సంచారంపై ఆరా!
తాడూరులో పర్యటించిన ఫారెస్ట్ అధికారులు
చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని తాడూరులో సోమవారం జిల్లా అటవీ శాఖ అధికారులు పర్యటించారు. గ్రామానికి చెందిన ఓ మహిళ వ్యవసాయ పనులు చేస్తుండగా చిరుత వచ్చిందన్న చెప్పడంతో సర్పంచ్, కార్యదర్శి ఇచ్చిన సమాచారం మేరకు వచ్చిన అధికారులు చిరుత పులికి సంబంధించిన గుర్తులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ చిరుత సంచరిస్తుందన్న చెప్పడంతో వచ్చామని, తాము పరిశీలించిన ఆనవాళ్లు ఏవి చిరుతకు సంబంధించినవి కావని తెలిపారు. మహిళతో పాటు చుట్టు ప్రక్కల ఉన్న వారిని అడగగా తామెవరం చూడలేదన్నారు. ప్రస్తుతం చిరుత సంచారం, ఆనవాళ్లు ఏమి లేవని, ఏదైనా అనుమానం ఉంటే సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఈజీఎస్ సిబ్బంది నిర్లక్ష్యం
రూ.18 వేల జరిమాన
బెజ్జంకి(సిద్దిపేట): ఉపాధి హామి పనుల వివరాలు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన ఈజీఎస్ మండల సిబ్బందికి రూ.18వేల జరిమాన విధించిట్లు ఎంపీడీఓ ప్రవీణ్ తెలిపారు. బెజ్జంకి రైతు వేదికలో ఉపాధి హామి మండల స్థాయి సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. 3.42 కోట్లతో మండలంలో 466 పనులు చేపట్టినట్టు వివరించారు. వాటి రికార్డులను సక్రమంగా నమోదు చేయందుకు ఏపీఓ రాజబాబుతో పాటు టీఏలు, కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లకు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్గౌడ్, సంతోష్, సతీశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మహిళ అదృశ్యం
నర్సాపూర్ రూరల్: మహిళ అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్సై రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అద్మాపూర్కు చెందిన వడ్ల వీరమణి (62) ఈనెల 3వ తేదీన ఇంట్లో జరిగిన గొడవల కారణంగా అదే రోజు ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రి వరకు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం చుట్టుపక్కల వారితో పాటు బంధువుల వద్ద ఆరా తీశారు. అయినా జాడ తెలియరాలేదు. దీంతో ఆలస్యంగా సోమవారం ఆమె కుమారుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని గాలిస్తున్నట్లు తెలిపారు.
డ్రంకెన్ డ్రైవ్ కేసులో
మూడు రోజుల జైలు
సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం తీర్పు
సంగారెడ్డి క్రైమ్: డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి పట్టణంలోని పోతిరెడ్డి పల్లి చౌరస్తా, బైపాస్లోని గుర్రపు బొమ్మ, పాత బస్టాండ్, ఐబీ వద్ద నిర్వహించిన డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 33 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిని సోమవారం సంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో హాజరుపరచగా జిల్లా మెదటి అదనపు న్యాయమూర్తి షకీల్ అహ్మద్ సిద్దిఖీ ఒకరి మూడు రోజులు జైలు, మరో ముగ్గురికి రెండు రోజులు జైలుశిక్ష, మిగతా ఇద్దరికి రూ. 2000, పదిమందికి రూ.1500, 17 మందికి రూ.వెయ్యి చొప్పున జరిమాన విధించినట్లు తెలిపారు.
8 మందికి ఒకరోజు జైలు
గజ్వేల్రూరల్: డ్రంకెన్ డ్రైవ్లో 8 మందికి ఒకరోజు జైలు శిక్ష పడినట్లు గజ్వేల్ సీఐ రవికుమార్ తెలిపారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన వాహన తనిఖీల్లో 12 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని సోమవారం గజ్వేల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ స్వాతి గౌడ్ ఎదుట హాజరు పర్చగా విచారణ అనంత రం నలుగురికి రూ. 40వేల జరిమానా, మరో 8 మందికి ఒకరోజు జైలు శిక్ష విధించారు.
చిరుత సంచారంపై ఆరా!


