ముగ్గురు మోసగాళ్లు అరెస్టు
రామాయంపేట(మెదక్): గుప్త నిధులు వెలికితీస్తాం.. జాతకం చెపుతామని ప్రజలను మోసగిస్తున్న ముగ్గురిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సీఐ వెంకట్ రాజాగౌడ్ కథనం ప్రకారం.. కాట్రియాల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వద్దకు సిరిసిల్లా జిల్లాకు చెందిన కడమంచి రాజారాం, రాకేశ్, సాదుల అశోక్ అనే ముగ్గురు వ్యక్తులు వచ్చి మీఇంటిలో బంగారం ఉందని, తీసి ఇస్తామని నమ్మబలికారు. వారిని నమ్మిన బాధితుడు నాలుగు లక్షల రూపాయాలు ఇచ్చారు. నాలుగైదు రోజుల తరువాత నష్టపోయినట్లు తెలుసుకున్న బాధితుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేస్తున్నారు. గ్రామాల్లోకి ఎవరైనా వస్తే తమకు సమాచారం అందజేయాలని సీఐ సూచించారు. ఎస్ఐ బాల్రాజు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


