వంతెన వేశారు.. రోడ్డు మరిచారు
అవస్థలు పడుతున్న వాహనదారులు
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణం నుంచి అల్గోల్ వెళ్లే దారిలో చేపట్టిన రోడ్డు పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. బ్రిడ్జి పనులు పూర్తి చేశారు గానీ రోడ్డు నిర్మాణం పనులు మాత్రం అర్ధాంతరంగా నిలిపివేశారు. దీంతో ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జహీరాబాద్ నుంచి భరత్నగర్ గుండా అల్గోల్ వెళ్లే రోడ్డు పూర్తిగా దెబ్బతింది. రోడ్డుకు అడ్డంగా పెద్ద మురికి (వాగు) కాలువ ప్రవహిస్తుంటుంది. పట్టణం నుంచి వచ్చే మురికినీటి వల్ల వాగు నిత్యం ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో రోడ్డు నీటిలో మునిగిపోతుంది. అప్పుడు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. ప్రజల ఇబ్బందులను గమనించిన ఆర్అండ్బీ అధికారులు నాలుగేళ్ల క్రితం వాగుపై బ్రిడ్జి, రోడ్డు నిర్మాణానికి రూ.33 లక్షలు మంజూరు చేశారు. టెండర్ పనులు పూర్తికాగానే కాంట్రాక్టర్ వంతెన పనులను ప్రారంభించారు. పలు కారణాల వల్ల నిర్మాణం పనులు నత్త నడకన సాగాయి. ఎట్టకేలకు బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేసినా రోడ్డు పనులు మాత్రం నిలిచిపోయాయి. గతేడాది వినాయక చవితి సందర్భంగా నిమజ్జనానికి వెళ్లే వాహనాల కోసం బ్రిడ్జికి ఇరువైపులా మొరంమట్టిని తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. వాహనాలు తిరగడం వల్ల దెబ్బతిని రోడ్డుపై గుంతలు పడ్డాయి. ఆర్అండ్బీ అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని వాహనదారులు కోరుతున్నారు.


