కలిసి తిరిగిన వాడే హంతకుడు
రూ.10 వేలు కావాలని బెదిరిస్తే ప్రాణాలు తీశాడు వీడిన మహిళ హత్యకేసు మిస్టరీ కేసును ఛేదించిన పోలీసులు నిందితుని అరెస్ట్, రిమాండ్
వర్గల్(గజ్వేల్): నాచారం వద్ద వివాహిత హత్యకేసు మిస్టరీ వీడింది. రూ.10 వేలు డబ్బులు కావాలని బెదిరిస్తుండటంతో, కలిసితిరిగిన వ్యక్తే మహిళ మెడకు తాడు బిగించి హత్యచేశాడు. ఆధునిక సాంకేతిక, సీసీ కెమెరాల పరిశీలన, క్వాలిటీ ఇన్వెస్టిగేషన్తో నిందితుడిని పోలీసులు గుర్తించారు. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గతంలో పలు దొంగతనాల కేసులో అతడు రిమాండ్కు వెళ్లివచ్చినట్లు గుర్తించారు. కొత్త సంవత్సరం రోజున వర్గల్ మండలం నాచారం వద్ద కలకలం రేపిన ఈ హత్యోదంతం కేసు వివరాలను సోమవారం గజ్వేల్ ఏసీపీ నర్సింహులు మీడియాకు వెల్లడించారు. మెదక్ జిల్లా మసాయిపేట మండలం కొప్పులపల్లికి చెందిన భదనపురం పెంటయ్య(30) డ్రైవర్. ఇతను గతంలో జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడిన ఘటనల్లో మనోహరాబాద్, నర్సాపూర్, మెదక్, గజ్వేల్, కామారెడ్డి పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రిమాండ్కు కూడా వెళ్లివచ్చాడు. నెల రోజుల క్రితం చేగుంట కల్లు డిపో వద్ద ఇస్లాంపూర్కు చెందిన మహిళ మంతూర్ కల్పన(26)తో ఇతనికి పరిచయమేర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరూ అప్పుడపుడు కలుసుకునేవారు. డిసెంబరు 31న సాయంత్రం కల్పన దావత్ చేసుకుందామని నిందితుడికి ఫోన్ చేసి పిలి రూ.10వేలు ఇవ్వాలని పెంటయ్యను డిమాండ్ చేసింది. అంత డబ్బు తన వద్ద లేదని చెప్పడంతో రేప్, చీటింగ్ కేసు పెడతానని బెదిరించింది. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో పెంటయ్య వాహనంలోని తాడును ఆమె మెడకు బిగించి హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించి అతని వద్ద నుంచి వాహనం, తాడు, ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. సోమ వారం నిందితుడు పెంటయ్యను రిమాండ్ చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.


