క్రీడలకు కేంద్రంగా పటాన్చెరు
జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గూడెం
పటాన్చెరు టౌన్: జాతీయస్థాయి క్రీడలకు పటాన్చెరు కేంద్రంగా మారిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో జరగనున్న జిఎంఆర్ ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ఆదివారం ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బాడీ బిల్డర్స్ తమ ప్రదర్శనలు నిర్వహించారు. అత్యుత్తమ ప్రదర్శన నిర్వహించిన బాడీ బిల్డర్లకు నగదు బహుమతి, ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..స్థానిక యువతకు శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, బాడీ బిల్డింగ్ పై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా పోటీలను ఏర్పాటు చేశామన్నారు. వచ్చే నెలలో జాతీయస్థాయి మహిళా కబడ్డీ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రభాకర్, గూడెం మధుసూదన్రెడ్డి, సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు, నిర్వాహకులు షకీల్, ఒమర్,, తదితరులు పాల్గొన్నారు.


