అమెరికా దాడిని ఖండించండి
పటాన్చెరు టౌన్: వెనుజువెలాపై అమెరికా దాడిని ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని సీఐటీయూ జిల్లా కోశాధికారి రాజయ్య పేర్కొన్నారు. వెనుజువెలాపై అమెరికా దాడిని నిరసిస్తూ ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలో శ్రామిక భవన్ నుంచి జాతీయ రహదారి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ...వెనుజువెలాపై అమెరికా టెర్రరిస్టుల కంటే భయంకరంగా విరుచుకుపడిందన్నారు. ఒక దేశంపై అమెరికా పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. ప్రపంచంలోనే వెనుజువెలాలో ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలను అమలు చేస్తున్న దేశమని, అది ప్రజా ప్రభుత్వమని ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, నాయకులు శ్రీనివాస్, రామకృష్ణ, సాయన్న, నరసింహారెడ్డి, నరసింహులు, నారాయణ, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా కోశాధికారి రాజయ్య


