యూనిటీ మార్చ్కు రమేశ్ ఎంపిక
సిద్దిపేటరూరల్: సర్దార్ వల్లాభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న యూనిటీ మార్చ్కు రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన గణగోని రమేశ్ ఎంపియ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనిటీ మార్చ్ హైదరాబాద్లోని నాంపల్లిలో ప్రారంభమై నాగపూర్, ఇండోర్ మీదుగా గుజరాత్లోని ఐక్యతా విగ్రహం వద్ద ముగుస్తుందన్నారు. తనను ఎంపిక చేసిన ఎంపీ రఘునందన్రావు, జిల్లా అధ్యక్షుడు శంకర్, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్కు కృతజ్ఞతలు తెలిపారు.
వీధి కుక్కల దాడి
ఆరుగురు చిన్నారులకు గాయాలు
రామాయంపేట(మెదక్): మండలంలోని లక్ష్మాపూర్లో వీధి కుక్కల దాడిలో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు. శనివారం ఇద్దరిపై దాడిచేసి గాయపర్చిన కుక్కలు, ఆదివారం మరో నలుగురిపై దాడి చేశాయి. గ్రామంలో పెరిగిపోయిన కుక్కల బెడదతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అరికట్టాలని పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
గంజాయి కేసులో
ఇద్దరు రిమాండ్
బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి శివారులో గంజాయి తాగుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని ముత్తన్నపేటకు చెందిన అజయ్, ఇల్లంతకుంట మండలం సోమారపేట గ్రామానికి చెందిన శేఖర్ గంజాయి తాగుతుండగా పట్టుకున్నారు. వీరిద్దరూ తాగడమే కాకుండా విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా అజయ్ గతంలో గాంజా కేసులో జైలుకెళ్లాడని, శేఖర్పై ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదైనట్లు తెలిపారు. రాజ్గోపాల్పేట, చిన్నకోడూర్ ఎస్ఐలు వివేక్, సైఫ్, ఏఎస్ఐ శంకర్రావు ఉన్నారు.
దాడి ఘటనలో..
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని వడ్లూరు గ్రామానికి చెందిన ఇద్దరు పాత నేరస్తులను దాడి చేసిన ఘటనలో ఆదివారం జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను తెలిపారు. ఈనెల 21న అన్నాడి సాయిరెడ్డి, శ్రీమాన్ వెళ్తున్న కారు అద్దాలను పగులగొట్టి వారిపై దాడి చేశారని నల్వాల శ్రీనివాస్, పైడిపాల మల్లేశంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. వీరిద్దరూ నేర చరిత్ర కలిగిన వారని పేర్కొన్నారు. కేసును చిన్నకోడూర్ ఎస్ఐ సైఫ్ దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
మూగ బాలుడు అదృశ్యం
పటాన్చెరు టౌన్: మూగ బాలుడు అదృశ్యమయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం... అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీకి చెందిన జలరం పాత్రో కుమారుడు ఆయూకత్ పాత్రో(12) ఆదివారం సాయంత్రం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు
చేస్తున్నారు.
మూలమలుపు వద్ద అదుపుతప్పి..
కొండపాక(గజ్వేల్): మూలమలుపు వద్ద గూడ్స్ లారీ అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి ఓ ఇంటి ముందు ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన మండలంలోని దుద్దెడ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా... సిద్దిపేట నుంచి హైదరాబాద్కు ఇనుప రాడ్స్తో గూడ్స్ లారీ వెళ్తుంది. ఈ క్రమంలో రాజీవ్ రహదారిపై ఉన్న మూల మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి ఇంటి ముందు గేట్ వరకు వెళ్లి ఆగిపోయింది. దీంతో పెద్ద శబ్దం రావడంతో ఇంట్లో నిద్రిస్తున్న వారు లేచి భయాందోళనకు గురయ్యారు. టోల్ ప్లాజా సిబ్బంది, పోలీసులు వాహనాన్ని బయటకు తీసి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
యూనిటీ మార్చ్కు రమేశ్ ఎంపిక
యూనిటీ మార్చ్కు రమేశ్ ఎంపిక


