
చందుకు డాక్టరేట్ ప్రదానం
చేర్యాల(సిద్దిపేట): మండలంలోని కడవేర్గు గ్రామానికి చెందిన గదరాజు చందు తెలుగు విభాగంలో డాక్టరేట్ పట్టా పొందాడు. మంగళవారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన 84వ స్నాతకోత్సవంలో ఓయూ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్, వైస్ చాన్సలర్ కుమార్ ఆయనకు డాక్టరేట్ను ప్రదానం చేశారు. అనంతరం చందును పలువురు ప్రొఫెసర్లు, స్నేహితులు అభినందించారు.
మహాధర్నాను విజయవంతం చేయాలి : పీఆర్టీయూ
జహీరాబాద్ టౌన్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్లో తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని పీఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు తులసీరాం రాథోడ్ ఉపాధ్యాయులను కోరారు. పట్టణంలోని బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన టీచర్ల శిక్షణ తరగతుల్లో పాల్గొని మాట్లాడారు. సీపీఎస్ను రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1న హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద మహాధర్నా ఉందని, ఉపాధ్యాయులు సెలవు పెట్టి ధర్నాలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు శ్రీశైలం, తుకారాం, ఆనంద్, ఆశోక్, వరాలు, ప్రదీప్కుమార్, స్వామిదాస్ పాల్గొన్నారు.
ఇల్లు కూలి వ్యక్తికి గాయాలు
నర్సాపూర్ రూరల్: ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండలంలోని పెద్ద చింతకుంటలో ఇల్లు కూలి వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన పారట్ల శ్రీనివాస్ సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇల్లు కూలి దూలం అతడి తలపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. మరో ఆరు మంది బయటకు పరుగులు తీశారు. వెంటనే అతడ్ని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఎంపీడీఓ మధులత, ఎంపీఓ శ్రీనివాసులు మంగళవారం గ్రామానికి వెళ్లి శ్రీనివాస్ ఇంటితో పాటు పక్కనే ఉన్న మరికొన్ని ఇళ్లను ఖాళీ చేయించి, ఇతర ఇండ్లకు తరలించారు. మండల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు 26 ఇళ్లు పాక్షికంగా కూలినట్లు తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు.
రెండు కాళ్లు కోల్పోయా ఆదుకోండి
చిన్నశంకరంపేట(మెదక్): రెండేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయానని ప్రభుత్వం ఆదుకోవాలని నార్సింగి మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన చెప్యాల సిద్దిరాములు వేడుకున్నారు. కన్పించిన నాయకులు, అధికారులను తనకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని అడిగినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రెండేళ్లుగా నడవలేక నరకయాతన అనుభవిస్తున్నానని, కనీసం తనకు వీల్చైర్ అయినా ఇవ్వాలని కోరాడు. ఏ పని చేయలేకపోతున్నానని, తనను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు.
విషపునీరు తాగి
పది మేకలు మృతి
తొగుట(దుబ్బాక): పది మేకలు మృత్యువాత పడిన ఘటన మండలంలోని లింగాపూర్లో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు... గ్రామానికి చెందిన బెస్త లింగం, ఎరుకుల అంజయ్య మేకలను పోషించుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో రోజూ మాదిరిగా మేకలను తోలుకుని మధ్యాహ్నం మేతకు వెళ్లారు. మేత తిని పంటచేళ్ల సమీపంలో నీళ్లు తాగాయి. మేకలు నీటిని తాగిన కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. కాపరులు, గ్రామస్తులు పశువైద్యాధికారికి ఫోన్లో సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకునే లోపు పది మేకలు మరణించారయి. వెంటనే వైద్య బృందం అప్రమత్తమై మిగతా మేకలకు వైద్యం అందించగా వాటి ఆరోగ్యం నిలకడగా ఉంది.

చందుకు డాక్టరేట్ ప్రదానం

చందుకు డాక్టరేట్ ప్రదానం

చందుకు డాక్టరేట్ ప్రదానం

చందుకు డాక్టరేట్ ప్రదానం