అమెరికాలో రోడ్డు ప్రమాదంలో
యువతి మృతి
సిద్దిపేటరూరల్: రావురూకుల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందింది. వివరాలు ఇలా.. సిద్దిపేట రూరల్ మండలం రావురూకుల గ్రామానికి చెందిన లక్కరసు శ్రీనివాస్ వర్మ, హేమలత కొన్నేళ్ల క్రితం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గండిమైసమ్మకు వలస వచ్చారు. వారికి శ్రీజ, శ్రేయ ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఉన్నత చదువుల కోసం శ్రీజ అమెరికాకు వెళ్లి ఇటీవల ఎంఎస్ పూర్తి చేసింది. కాగా సోమవారం రాత్రి ఓ రెస్టారెంట్లో భోజనం చేసి తన రూమ్కు కారులో వెళ్తుంది. ఈ క్రమంలో కారును ట్రక్కు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై స్పాట్లోనే చనిపోయింది. దీంతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.శ్రీజ చెల్లెలు శ్రేయ కూడా ఇటీవలే ఎంఎస్ చదివేందుకు అమెరికాకు వెళ్లింది. కూతురు చనిపోవడంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
టీవీ,సెల్ఫోన్లకు
దూరంగా ఉండాలి
దుబ్బాకరూరల్: విద్యార్థులు టీవీ, సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి సూచించారు. అక్బర్పేట– భూంపల్లి మండలం రామేశ్వరంపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో దాత బెల్లోజి రమేశ్ సహకారంతో విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అంజయ్య, హెచ్ఎంలు నీలం శ్రీనివాస్, నారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జీతాల కోసం
కార్మికుల నిరసన
హత్నూర( సంగారెడ్డి): ప్రభుత్వం నుంచి వేతనాలు సక్రమంగా రాకపోవడంతో కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు పడుతున్నామని గ్రామపంచాయతీ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు ఎర్ర పోచయ్య అన్నారు. మంగళవారం మండలంలోని దౌల్తాబాద్లో పంచాయతీ కార్మికులు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ భిక్షాటన చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు ముత్యం, కార్యదర్శి అశోక్, సహాయ కార్యదర్శి శంకరయ్య కోశాధికారి సాయిలు, కమిటీ సభ్యులు, శాంతమ్మ, బాలమణి, యాదయ్య, పోచయ్య, రాజయ్య, నరేశ్ పాల్గొన్నారు.
మహిళ అదృశ్యం
పటాన్చెరు టౌన్: మహిళ అదృశ్యమైన ఘటన బీడీఎల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... నల్గొండకు చెందిన తిరుపతి బతుకుదెరువు కోసం నాలుగు నెలల క్రితం వచ్చి తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాటీలో నివాసం ఉంటూ స్థానికంగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తిరుపతి భార్య రమణ ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి..
సంగారెడ్డి క్రైమ్: ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేశ్ వివరాల ప్రకారం... పాపన్నపేట మండలం పాపన్నపేట గ్రామానికి చెందిన చాకలి ఎల్లయ్య(42), బంధువుల చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లాడు. ప్రతిరోజు సాయంత్రం తరచూ కల్లు తాగే అలవాటు ఉండటంతో సోమవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లిన అతడు తిరిగి రాలేదు. చుట్టు ప్రక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బ్యాంక్ ఉద్యోగి
ఇంట్లో చోరీ
సంగారెడ్డి క్రైమ్: ఉద్యోగి ఇంట్లో దొంగలు పడి బంగారం, నగదు దోచుకెళ్లారు. పట్టణ సీఐ రమేశ్ వివరాల ప్రకారం.. రాయికోడు మండలం పాంపాడు గ్రామానికి చెందిన బోరంచ నర్సింహులు వృత్తిరీత్య పట్టణంలోని కెనరా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్యాపిల్లలతో కలిసి మధురానగర్లో నివాసం ఉంటున్నాడు. ఈనెల 8న రాఖీ సందర్భంగా స్వగ్రామానికి వెళ్లాడు. భార్య శశికళ, పిల్లలతో కలిసి అదే కాలనీలో ఉండే చిన్నమ్మ ఇంటికి ఈనెల 11న రాత్రి పడుకోవడానికి వెళ్లింది. 12న వచ్చి చూడగానే ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలోని మూడున్నర తులాల బంగారం, డబ్బు చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పొలీసులు వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రావురూకులలో విషాదం