వివాదాస్పద భూమిని పరిశీలించిన ట్రైనీ కలెక్టర్
న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని గుంజోటి గ్రామంలో వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ భూములను బుధవారం ట్రైనీ కలెక్టర్ మనోజ్, జహీరాబాద్ ఆర్డీవో రాంరెడ్డి పరిశీలించారు. 112 సర్వే నంబర్లో సుమారు 59 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిలో గ్రామానికి చెందిన కొందరు గతంలో పట్టాలు పొందారు. ఐతే పట్టాలు లేకున్నా తాతల నుంచి వచ్చిన భూమని సాగు చేసుకుంటున్నామని కొందరు, ప్రభుత్వం తమకు భూమి ఇచ్చిందని ఇది తమకే చెందుతుందని మరికొందరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు వివాదస్పదంగా మారిన భూములను బుధవారం ట్రైనీ కలెక్టర్ మనోజ్, జహీరాబాద్ ఆర్డీవో రాంరెడ్డి పరిశీలించి వివరాలను అక్కడి రైతులనుంచి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ భూపాల్ తదితరులు ఉన్నారు.
వీఆర్ఏల ముందస్తు అరెస్టు
నారాయణఖేడ్: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శాసనసభను ముట్టడించేందుకు వీఆర్ఏలు యత్నిస్తున్నారనే సమాచారంతో బుధవారం ఉదయం నారాయణఖేడ్లో పోలీసులు ముందస్తుగా పలువురు వీఆర్ఏలను అరెస్టు చేశారు. వీఆర్ఏల సంఘం నాయకులు శంకర్, యాదయ్య, అల్లంరాజు, తుకారం, చోటుమియాలను అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ... తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, అరెస్టులతో తమ ఉద్యమాలను ఆపలేరన్నారు.
పోలీసుల అదుపులో
మాజీ సర్పంచ్లు
జహీరాబాద్ టౌన్: పెండింగ్ బిల్లుల కోసం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లోని పలు గ్రామాల మాజీ సర్పంచ్లను బుధవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. మాజీ సర్పంచ్లతో కలసి వెళ్తున్న బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తట్టు నారాయణ కూడా జహీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అప్పులు చేసి గ్రామాల అభివృద్ధి చేశామని, బకాయి బిల్లులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ పరీక్షలలో భాగంగా బుధవారం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం బైపీసీ విద్యార్థులకు బోటనీ, ఎంపీసీ విద్యార్థులకు మ్యాథ్స్–2, సీఈసీ విద్యార్థులకు సివిక్స్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 16,727మంది విద్యార్థులకు గానూ 16,375 మంది విద్యార్థులు హాజరు కాగా 352మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విభాగంలో 15,188మందికి గానూ 14,925మంది విద్యార్థులు హాజరు కాగా 263మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,539 మంది విద్యార్థులకు 1,450మంది హాజరు కాగా 89మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
విగ్రహాలకు ముసుగు
తొలగింపు
సంగారెడ్డి క్రైమ్: గ్రాడ్యుయేట్ ఎమ్మెస్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పట్టణంలో ‘విగ్రహాలకు ధరించిన ముసుగు తొలగించరా’అంటూ ఈనెల 11న ప్రచురితమైన ‘సాక్షి’కథ నానికి స్పందించిన పట్టణ మున్సిపల్ అధికారులు స్పందించారు. విగ్రహాలకు వేసిన ముసుగును బుధవారం తొలగించారు.
వివాదాస్పద భూమిని పరిశీలించిన ట్రైనీ కలెక్టర్
వివాదాస్పద భూమిని పరిశీలించిన ట్రైనీ కలెక్టర్
వివాదాస్పద భూమిని పరిశీలించిన ట్రైనీ కలెక్టర్


