మోదీ పాలనలో ప్రజాస్వామ్యం అస్తవ్యస్తం
కొండాపూర్(సంగారెడ్డి): మోదీ పాలనలో ప్రజాస్వామ్యం అస్తవ్యస్తంగా తయారైందని, ప్రజాస్వామ్యంలో గెలిచిన ప్రభుత్వాలను డబ్బులతో కొనుగోలు చేసి అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయాలని చూస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. మంగళవారం సంగారెడ్డిలోని టీఎన్జీఓ భవన్లో ఉమ్మడి మెదక్ జిల్లా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ దేశ ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చు పెట్టి జాతిని విచ్చిన్నం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మోదీ అవినీతి పాలనను ప్రశ్నించే వారిపై ఎంకై ్వరీల పేరుతో దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. సీపీఐ, ఈడీని తమ జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్తో ఇప్పటివరకు ఎలాంటి పొత్తు లేదని, కేవలం కొన్ని అంశాల వారీగానే మద్దతు తెలుపుతున్నామన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీని ఓడించే పార్టీలకు ఎప్పుడూ తమ మద్దతు ఉంటుందన్నారు. రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ కేంద్రం తమ అవసరాలకు అనుగుణంగా సవరణలు చేస్తుందన్నారు. ప్రజా సమస్యలే పరిష్కారంగా సీపీఐ ఎప్పుడూ ప్రజల పక్షానే పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై బీజేపీ వేసిన శిక్ష మరణ దండన వంటిదని, రాహుల్ మాట్లాడిన మాటల్లో ఏ తప్పు లేదన్నారు. మోదీతో పాటు బీజేపీ నాయకులు తమ ఇష్టానుసారంగా ఎంతో మందిని అవమానించారని, అందుకు వారిని ఎన్నో సార్లు జైలులో పెట్టాల్సివస్తుందో ఒక సారి అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నర్సింహ, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్, సీపీఐ జిల్లా కార్యదర్శులు పవన్, ఖాలేద్, రెహహాన్, షఫీ, అహ్మద్, సునీత, తాజొద్దీన్ తదితరులున్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
కూనంనేని సాంబశివరావు