పిల్లల పెంపకం.. చాలా కాస్ట్లీ | 8 Lakh Per Annum School Fees in Metropolitan area | Sakshi
Sakshi News home page

పిల్లల పెంపకం.. చాలా కాస్ట్లీ

Jun 13 2025 1:03 AM | Updated on Jun 13 2025 1:03 AM

8 Lakh Per Annum School Fees in Metropolitan area

నగరాలూ పట్టణాల్లో పెరిగిన వ్యయం

ఒకరి కోసమే ఏడాదికి రూ.13 లక్షలు

చదువుకు కనీసం రూ.8 లక్షలు

మిగతా ఖర్చులు రూ.5 లక్షలు

బడులు తెరిచేవేళ చర్చకు తెరలేపిన లింక్డ్‌ఇన్‌ పోస్టు

‘ఒకరికి ఏడాదికి రు.13 లక్షలు’
ముంబైకి చెందిన అంకుర్‌ ఝవేరీ అనే ఒక ప్రొఫెషనల్‌ తాజాగా లింక్డ్‌ఇన్‌లో పెట్టిన ఈ పోస్టు.. పట్టణ ప్రాంత మధ్యతరగతి తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని ఎత్తి చూపుతూనే, పిల్లల పెంపకానికి, చదువుకు అయ్యే ఖర్చు విపరీతంగా పెరుగుతుండటంపై ఆందోళన రేకెత్తించింది. మెట్రోపాలిటన్‌ నగరంలో ఒకరికి ఏడాదికి రూ.13 లక్షలు ఖర్చవుతుండగా, అందులో చదువుకు అయ్యే ఖర్చే రు.7 నుంచి 8 లక్షల వరకు ఉంటోందని ఝవేరీ తన పోస్టులో అంచనా వేశారు. ‘గత వారం నేను నా కజిన్‌ను కలిసే వరకు, భారతదేశంలోనిఇ నగరాల్లో పిల్లలను పెంచడం తలకు మించిన భారమని నాకు తెలియదు’ అని ఝవేరీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

నెలకు రూ.లక్షకు పైగానే 
ఏదైనా ఒక ఇంటర్నేషన్‌ స్కూల్‌లో ట్యూషన్‌ ఫీజు ఏడాదికి ఒకరికి రూ.7 నుండి 8 లక్షల మధ్య ఉందని, ఇక యూనిఫారాలు, పుస్తకాలు, ప్రైవేట్‌ ట్యూషన్లు, చదువుకు 
సంబంధించిన ఇతర ఖర్చులన్నీ కలిపితే – సంవత్సరానికి మరో రూ. 2 నుండి 4 లక్షల వరకు అవుతుందని అంకుర్‌ ఝవేరీ పేర్కొన్నారు. ఒక విద్యా సంవత్సరానికి మొత్తం ఖర్చు దాదాపుగా రూ.12 లక్షలు అవుతోందని చెప్పారు. ఝవేరీ మరికొన్ని ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ రూ.12 లక్షలకు అదనంగా కోచింగ్‌ / పాఠ్యేతర కార్యకలాపాలు, దుస్తులు, పుట్టినరోజు పార్టీలు, హాలిడే ఖర్చులు మొదలైనవి కూడా నెలకు రూ.8000–10,000 (ఏడాదికి రూ.1 లక్ష) చొప్పున కలిపితే, మొత్తం వార్షిక వ్యయం రూ.13 లక్షలు అవుతుందని తన పోస్టులో అంచనా కట్టారు.

ఆర్థిక భారానికి సిద్ధం
ఈ లెక్కలన్నీ కూడా తన పైపై అంచనాలు మాత్రమే అని అంగీకరిస్తూ, ‘నేనింకా ఏమైనా మిస్‌ అయ్యానేమో తల్లిదండ్రులు చెప్పాలి’ అని ఝవేరీ నెటిజనుల అభిప్రాయాన్ని కోరారు. తన పోస్టుపై వ్యతిరేకత వ్యక్తం అవుతుందేమోనని భావించిన ఝవేరీ, ‘‘కొంతమంది ఐ.సి.ఎస్‌.ఇ. పాఠశాలలు తక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయి, పిల్లల్ని అక్కడ చేర్చవచ్చు కదా?’ అని అనొచ్చు. ఇక్కడ నేను రెండు విషయాలను తీసుకుని ఈ లెక్కలు వేశాను. అవి, ఒకటి : ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చదువును అందించాలని కోరుకుంటారు. రెండు : ఐ.సి.ఎస్‌.ఇ. పాఠశాలల్లో ప్రవేశం దొరకటం చాలా కష్టం’ అని ఝవేరీ వివరించారు.

సామాజిక ఒత్తిడీ కారణం! 
ఝవేరీ పెట్టిన పోస్టుపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమంది ఆయనతో ఏకీభవించారు. మరికొంత మంది విభేదించారు. ఖరీదైన పాఠశాలలు కావాలనుకున్నప్పుడే ఇంత ఖర్చు అవుతుంది అని కొందరు వాదించారు. ఒక నెట్‌ యూజర్‌ ‘బ్రాండెడ్‌ స్కూళ్లలో అంతేగా’ అని కామెంట్‌ చేశారు. మరొకరు.. పిల్లల చదువు విషయమై తల్లిదండ్రుల మీద ఉండే సామాజిక ఒత్తిడి గురించి మాట్లాడారు. తమ పిల్లలు ఎక్కడ వెనుకబడి పోతారోనన్న భయంతో తల్లిదండ్రులు కష్టమో, నష్టమో తలకు మించిన ఆర్థిక భారానికి సిద్ధమౌతారు, ప్రైవేటు స్కూళ్లు చెప్పే ఫీజులు కడతారు అని చెప్పారు. ఒక నెటిజెన్‌ ఝవేరీ పోస్టుతో పూర్తిగా విభేదించారు. ‘సెలబ్రిటీల పిల్లలు చదివే స్కూళ్లలో మీ పిల్లల్ని ఎవరు చదివించమన్నారు?’ అని విమర్శించారు. ఐ.సి.ఎస్‌.ఇ., సి.బి.ఎస్‌.ఇ., ఐ.జి.సి.ఎస్‌.ఇ. పాఠశాలల్లో సీటు తెచ్చుకోగలిగితే తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను పిల్లలకు అందివ్వవచ్చు అని కొందరు అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement