Metropolitan City
-
పిల్లల పెంపకం.. చాలా కాస్ట్లీ
‘ఒకరికి ఏడాదికి రు.13 లక్షలు’ముంబైకి చెందిన అంకుర్ ఝవేరీ అనే ఒక ప్రొఫెషనల్ తాజాగా లింక్డ్ఇన్లో పెట్టిన ఈ పోస్టు.. పట్టణ ప్రాంత మధ్యతరగతి తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని ఎత్తి చూపుతూనే, పిల్లల పెంపకానికి, చదువుకు అయ్యే ఖర్చు విపరీతంగా పెరుగుతుండటంపై ఆందోళన రేకెత్తించింది. మెట్రోపాలిటన్ నగరంలో ఒకరికి ఏడాదికి రూ.13 లక్షలు ఖర్చవుతుండగా, అందులో చదువుకు అయ్యే ఖర్చే రు.7 నుంచి 8 లక్షల వరకు ఉంటోందని ఝవేరీ తన పోస్టులో అంచనా వేశారు. ‘గత వారం నేను నా కజిన్ను కలిసే వరకు, భారతదేశంలోనిఇ నగరాల్లో పిల్లలను పెంచడం తలకు మించిన భారమని నాకు తెలియదు’ అని ఝవేరీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.నెలకు రూ.లక్షకు పైగానే ఏదైనా ఒక ఇంటర్నేషన్ స్కూల్లో ట్యూషన్ ఫీజు ఏడాదికి ఒకరికి రూ.7 నుండి 8 లక్షల మధ్య ఉందని, ఇక యూనిఫారాలు, పుస్తకాలు, ప్రైవేట్ ట్యూషన్లు, చదువుకు సంబంధించిన ఇతర ఖర్చులన్నీ కలిపితే – సంవత్సరానికి మరో రూ. 2 నుండి 4 లక్షల వరకు అవుతుందని అంకుర్ ఝవేరీ పేర్కొన్నారు. ఒక విద్యా సంవత్సరానికి మొత్తం ఖర్చు దాదాపుగా రూ.12 లక్షలు అవుతోందని చెప్పారు. ఝవేరీ మరికొన్ని ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ రూ.12 లక్షలకు అదనంగా కోచింగ్ / పాఠ్యేతర కార్యకలాపాలు, దుస్తులు, పుట్టినరోజు పార్టీలు, హాలిడే ఖర్చులు మొదలైనవి కూడా నెలకు రూ.8000–10,000 (ఏడాదికి రూ.1 లక్ష) చొప్పున కలిపితే, మొత్తం వార్షిక వ్యయం రూ.13 లక్షలు అవుతుందని తన పోస్టులో అంచనా కట్టారు.ఆర్థిక భారానికి సిద్ధంఈ లెక్కలన్నీ కూడా తన పైపై అంచనాలు మాత్రమే అని అంగీకరిస్తూ, ‘నేనింకా ఏమైనా మిస్ అయ్యానేమో తల్లిదండ్రులు చెప్పాలి’ అని ఝవేరీ నెటిజనుల అభిప్రాయాన్ని కోరారు. తన పోస్టుపై వ్యతిరేకత వ్యక్తం అవుతుందేమోనని భావించిన ఝవేరీ, ‘‘కొంతమంది ఐ.సి.ఎస్.ఇ. పాఠశాలలు తక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయి, పిల్లల్ని అక్కడ చేర్చవచ్చు కదా?’ అని అనొచ్చు. ఇక్కడ నేను రెండు విషయాలను తీసుకుని ఈ లెక్కలు వేశాను. అవి, ఒకటి : ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చదువును అందించాలని కోరుకుంటారు. రెండు : ఐ.సి.ఎస్.ఇ. పాఠశాలల్లో ప్రవేశం దొరకటం చాలా కష్టం’ అని ఝవేరీ వివరించారు.సామాజిక ఒత్తిడీ కారణం! ఝవేరీ పెట్టిన పోస్టుపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమంది ఆయనతో ఏకీభవించారు. మరికొంత మంది విభేదించారు. ఖరీదైన పాఠశాలలు కావాలనుకున్నప్పుడే ఇంత ఖర్చు అవుతుంది అని కొందరు వాదించారు. ఒక నెట్ యూజర్ ‘బ్రాండెడ్ స్కూళ్లలో అంతేగా’ అని కామెంట్ చేశారు. మరొకరు.. పిల్లల చదువు విషయమై తల్లిదండ్రుల మీద ఉండే సామాజిక ఒత్తిడి గురించి మాట్లాడారు. తమ పిల్లలు ఎక్కడ వెనుకబడి పోతారోనన్న భయంతో తల్లిదండ్రులు కష్టమో, నష్టమో తలకు మించిన ఆర్థిక భారానికి సిద్ధమౌతారు, ప్రైవేటు స్కూళ్లు చెప్పే ఫీజులు కడతారు అని చెప్పారు. ఒక నెటిజెన్ ఝవేరీ పోస్టుతో పూర్తిగా విభేదించారు. ‘సెలబ్రిటీల పిల్లలు చదివే స్కూళ్లలో మీ పిల్లల్ని ఎవరు చదివించమన్నారు?’ అని విమర్శించారు. ఐ.సి.ఎస్.ఇ., సి.బి.ఎస్.ఇ., ఐ.జి.సి.ఎస్.ఇ. పాఠశాలల్లో సీటు తెచ్చుకోగలిగితే తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను పిల్లలకు అందివ్వవచ్చు అని కొందరు అన్నారు. -
మెట్రోల్లో తగ్గిన బ్యాంకు రుణాలు!
ముంబై: దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో బ్యాంకుల రుణాల వాటా చెప్పుకోతగ్గ మేర క్షీణించింది. ఐదేళ్ల క్రితం బ్యాంకుల మొత్తం రుణాల్లో 63.5 శాతంగా ఉంటే 2025 మార్చి చివరికి 58.7 శాతానికి తగ్గినట్టు ఆర్బీఐ డేటా వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న పట్టణాల్లో రుణ వితరణ పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.డిపాజిట్ల విషయంలో దీనికి విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే మెట్రోపాలిటన్ శాఖల్లోనే అధికంగా 11.7 శాతం వృద్ధి 2025 మార్చిలో నమోదైంది. ఇదే కాలంలో గ్రామీణ శాఖల్లో 10.1 శాతం, సెమీ అర్బన్ శాఖల్లో 8.9 శాతం, అర్బన్ శాఖల్లో 9.3 శాతం నమోదైంది.ముంబై, ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో బ్యాంకుల రుణాల వాటా తగ్గడం, గ్రామీణ, చిన్న పట్టణాల్లో రుణ వితరణ పెరగడం కొన్ని ముఖ్యమైన ఆర్థిక పరిణామాలను సూచిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రుణ ప్రాప్తి పెరగడం అక్కడి వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ రంగంలో పెట్టుబడులు, అలాగే చిన్న తరహా పరిశ్రమల విస్తరణకు తోడ్పడవచ్చు. దీని ద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థ మరింత సమతుల్యత సాధించవచ్చు.చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో రుణాల పెరుగుదల వల్ల స్థిరాస్తి, పేదరిక నిర్మూలన, అలాగే ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. బ్యాంకులు పెద్ద నగరాల బదులుగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలకు ప్రత్యేకంగా దృష్టి సారించడం కూడా దీనికి కారణంగా తెలుస్తోంది. మెట్రోపాలిటన్ నగరాల్లో రుణాల వాటా తగ్గడం, డిపాజిట్ల వృద్ధి ఎక్కువగా ఉండటం ఆదాయ స్థాయిలు పెరుగుతుండటం, పొదుపు అలవాట్లు మెరుగుపడటం వంటి జీవన శైలి మార్పులను సూచిస్తున్నాయి. -
నగరాలు.. రోగాల అడ్డాలు
సాక్షి, హైదరాబాద్: పట్టణాలు, నగరాలు అనారోగ్యంతో కునారిల్లుతున్నాయి. ట్రాఫిక్ మొదలుకొని ఫాస్ట్ఫుడ్ వరకు అనేక అంశాలు ఆరోగ్యంపై చూపెడుతున్న ప్రభావాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. నగర జీవనశైలి వ్యాధులకు నిలయంగా మారుతోందని పేర్కొంది. ‘ఆరోగ్య నగరాలను ఎలా తయారు చేయాలి’అనే అంశంపై ఇటీవల ఒక నివేదిక తయారు చేసింది. ట్రాఫిక్ రద్దీ, మద్యం తాగి వాహనాలు నడపడం, సీటు బెల్టు, హెల్మెట్ ధరించకపోవడం, ఫలితంగా రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యకరమైన జీవనశైలి, శారీరక వ్యాయామం లేకపోవడం, వృద్ధులను పట్టించుకోకపోవడం ఇలా పలు సమస్యలు నగర జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. ఈ పరిస్థితులను మార్చాల్సిన అవసరాన్ని తెలియజెప్పింది. వివిధ అంశాలపై విశ్లేషణ చేసింది. ట్రాఫిక్ రద్దీ.. నగరాలు, పట్టణాల్లో రహదారులు దారుణంగా ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ సరిగా లేకపోవడం, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి ఏడాది 5–29 సంవత్సరాల వయస్సు గలవారు 10 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. 5 కోట్ల మంది వరకు గాయపడుతున్నారు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల అభివృద్ధిపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. హెల్మెట్లు, సీట్ బెల్ట్ల వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. రహదారులను మరింత సురక్షితంగా మార్చడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. మానసిక అనారోగ్యం.. మరోవైపు పేదరికం, నిరుద్యోగం, ట్రాఫి క్, శబ్ద కాలుష్యం, మౌలిక సదుపాయాలు, పచ్చని ప్రదేశాలు లేకపోవడం పట్టణవాసులు ఎదుర్కొంటున్న మరికొన్ని అడ్డంకులు. ఈ సమస్యలన్నీ మానసిక అనారోగ్యాన్ని సృష్టిస్తున్నాయి. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఇప్పుడు నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్నారు. దీంతో రద్దీ అధికంగా ఉంటుంది. శబ్ద కాలుష్యం, దీర్ఘకాలిక ఒత్తిడి కలిపి సామాజిక ఒంటరితనానికి దారితీస్తాయి. నగరాల్లో గాలి నాణ్యత తగ్గింది. ప్రతీ పది మందిలో 9 మంది రోజూ కలుషితమైన గాలిని పీల్చుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా . వాయు కాలుష్యంతో గుండె, శ్వాసకోశ వ్యాధులు, ఉబ్బసం, ఊపిరితిత్తుల కేన్సర్కు దారితీస్తుంది. పెరుగుతున్న పట్టణ హింస.. పట్టణాలు, నగరాల్లో హింస పెచ్చుమీరుతోంది.15–44 ఏళ్ల మధ్య వయసు వారు అధికంగా హింసకు పాల్పడుతున్నారు. లైంగిక వేధింపులతో సహా ప్రాణాంతకమైన హింసతో ఏటా 10 లక్షల మంది గాయపడుతున్నారు. వేలాది మంది హత్య కు గురవుతున్నారు. అధిక జనాభా సాంద్రత ఉన్న నగరాల్లో హింస ఎక్కువగా కనిపిస్తోంది. అనారోగ్యకరమైన ఆహారం.. అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర అధికంగా ఉన్న ఆహారం, పానీయాలను అందించే ఫాస్ట్ఫుడ్ దుకాణాలు నగర ఆరోగ్యానికి సవాల్గా మారింది. ఆహార పదార్థాల మార్కెటింగ్ పిల్లలను లక్ష్యంగా చేసుకుం టు న్నాయి. బయటి ఆహారానికి నగర ప్రజలు అలవాటు పడుతుండటంతో బీపీ, షుగర్, ఊబకాయం అధికమవుతున్నాయి. కొరవడుతున్న శారీరక శ్రమ.. గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం, బీపీ, కొన్ని కేన్సర్లను నివారించడంలో శారీరక శ్రమ సాయపడుతుంది. వ్యాయామం చేయడానికి బహిరంగ, పచ్చని ప్రదేశాలు లేకపోవడంతో శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. ఇదే నగర పౌరులను అనారోగ్యంగా మార్చుతోంది. వృద్ధులకు వసతులు ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి సంఖ్య ఇతర వయసుల వారికంటే వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న వృద్ధుల జనాభా అవసరాలకు అనుగుణంగా నగర నిర్మాణాలుండాలి. పిల్లలు దూరంగా వెళ్లిపోవడం, భాగస్వామి చనిపోవడంతో వృద్ధులు ఒంటరితనానికి గురవుతున్నారు. సామాజిక సంబంధాలు విచ్ఛిన్నం కావడంతో వీరు దుర్భర జీవితం గడుపుతున్నారు. కాబట్టి నగరాల్లో వృద్ధులకు ఆరోగ్య కేంద్రం, సూపర్ మార్కెట్, సమాజ జీవితంలో పాల్గొనడానికి అవకాశం కల్పించాలి. -
మెట్రోలతో పోటీ
విశ్వనగరం దిశగా వడివడి అడుగులేస్తున్న భాగ్యనగరి...అభివృద్ధి విషయంలో దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలతో పోటీ పడుతోంది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ ఇండియా సంస్థ 2015లో నిర్వహించిన సర్వేలో నాలుగో స్థానం సంపాదించి సత్తా చాటింది. ఈ సంస్థ ఆయా నగరాల్లో 800 అంశాలను పరిశీలించి సిటీలకు ర్యాంకులిచ్చింది. సర్వేలో పరిగణనలోకి తీసుకున్న అంశాల్లో.. భౌతిక వనరులు, ఆర్థిక పరిస్థితి, మౌలిక వసతులు, పరిపాలన, మానవ సామర్థ్యం, జనాభా, సంపద పంపిణీ, వ్యాపార ప్రోత్సాహకాలు, వ్యవస్థాగత సహకారం తదితరాలు ఉన్నాయి. ఈ సర్వేలో 69.73 స్కోర్ సాధించి ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. చివరి రెండు స్థానాల్లో నిలిచిన పుణె 59.85, అహ్మదాబాద్ 58.04 పాయింట్లు సాధించడం విశేషం. సర్వేలో మెట్రోపాలిటన్ సిటీలు సాధించిన స్కోర్, ర్యాంకుల వివరాలిలా ఉన్నాయి.