హయత్నగర్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హయత్నగర్లోని గిరిజన బాలికల గురుకుల కళాశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి గాను తాత్కాలిక లెక్చరర్స్గా పని చేసేందుకు అర్హత గల మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయ లలిత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంగ్లిష్ మీడియంలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయని, సంబంధిత సబెక్టుల్లో పీజీతో పాటు బీఎడ్ అర్హత గల అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 11న ఉదయం 9 గంటలకు రాజేంద్రనగర్ మానస హెల్త్ భవనంలోని జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా హాజరు కావాలన్నారు. వివరాలకు 83099 31449 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
ఇబ్రహీంపట్నం: డా.బీఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ 2026–27 ప్రవేశాల గడువును సెప్టెంబర్ 9 వరకు పెంచినట్లు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాధిక, సెంటర్ కో–ఆర్డినేటర్ శంకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక ఓపెన్ స్టడీ సెంటర్–172లో బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ ప్రథమ సంవత్సరంలో కోర్సుల్లో చేరేందుకు అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, ఎస్ఎస్సీ ఉత్తీర్ణులై, రెండేళ్ల ఐటీఐ కోర్సు చేసిన విద్యార్థులు సైతం ప్రవేశాలకు అర్హులని చెప్పారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజులను సకాలంలో చెల్లించాలన్నారు.
మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని హిమాయత్నగర్ పోచమ్మ ఆలయం హుండీలో ఓ భక్తుడు అమెరికన్ డాలర్ వేశారు. ఆదివారం బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు బోనాలతో వచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా కొందరు అమ్మవారి హుండీలో కానుకలు సమర్పించారు. ఓ భక్తుడు అమ్మవారి హుండీలో ఒక డాలర్ వేశాడు. సాయంత్రం ఆలయ నిర్వాహకులు హుండీ తెరిచి లెక్కించడంతో డాలర్ బయటపడింది. అది హుండీలో ఎవరు వేశారోనని స్థానికంగా చర్చ జరుగుతోంది. పరిసర ప్రాంతాల్లోని ఫాంహౌస్ల్లో ఉన్నవారు వేసి ఉండొచ్చని భావిస్తున్నారు.
హుడాకాంప్లెక్స్: హైడ్రా ఉద్యోగాల ఎంపికకు అనూహ్యంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరుకావడంతో దేహదారుఢ్య పరీక్షల గడువును ఈ నెల 11 వరకు పొడిగించారు. తొలుత రెండు రోజులపాటు నిర్వహించాల్సిన ఈవెంట్స్కు వేలాదిమంది తరలిరావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 100 డీఆర్ఎఫ్ అసిస్టెంట్, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు మాత్రమే ఉన్నప్పటికీ.. హాజరైన ప్రతి అభ్యర్థికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
జూ పార్క్లో ఘనంగా
సింహాల దినోత్సవం
బహదుర్పురా: ప్రపంచ సింహాల దినోత్సవాన్ని నెహ్రూ జులాజికల్ పార్క్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జంతు సంరక్షకులు జూ సందర్శకులకు వన్యప్రాణులపై అవగాహన కల్పించడంతో పాటు సింహాలపై టాక్ షో నిర్వహించారు. వాటి ఆహార అలవాట్లు, ప్రవర్తన, సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జూ పార్కులో ఆసియా, ఆఫ్రికన్ సింహాలు ఉన్నాయని డిప్యూటీ క్యూరేటర్ మురళీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ క్యూరేటర్లు నజియ తబస్సుమ్, లక్ష్మణ్, పీఆర్వో హనీఫ్, జూ పార్క్ ఎడ్యుకేషన్ అధికారి దీపక్ తరుణ్, యానిమల్ కీపర్ అయూబ్ కౌసర్ తదితరులు పాల్గొన్నారు.


