ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీ శివం ఉపాధ్యాయ
కొత్తూరు: చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళనకరమని ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీ శివం ఉపాధ్యాయ అన్నారు. పట్టణంలోని పెంజర్ల కూడలిలో బుధవారం ఆయన వాహనదారులు, ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఇటీవలి రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించని కారణంగానే మృతి చెందారన్నారు. కార్లలో ప్రయాణించే వారు సీట్బెల్టులు, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలన్నారు. మైనర్లు, లెసెన్స్ లేని వారు వాహనాలు నడుపొద్దని సూచించారు. డ్రంకెన్ డ్రైవ్, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్, షాద్నగర్ ట్రాఫిక్ సీఐ శంకరయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


