మొయినాబాద్రూరల్: టమాటాలకు ఆశించిన ధర రాకపోవడంతో రైతులు మార్కెట్లో అమ్మలేక.. తిరిగి ఇళ్లకు తీసుకెళ్లలేక గ్రామాలకు వెళ్తూ రోడ్ల పక్కన పారబోస్తున్నారు. గుడిమల్కాపూర్, శంషాబాద్ రైతుబజార్ మార్కెట్లలో ఒక్కోపెట్టె (25 కిలోలు)కు తాజాగా ఉంటే రూ.200–220 ధర పలుకుతోంది. కూలీ.. రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో రోడ్డు పక్కన పారబోసి ఇంటి ముఖం పడుతున్నారు. మండల పరిధిలోని చందానగర్, రెడ్డిపల్లి సమీపంలో రోడ్డు పక్కన టమాటాలు పారబోసి కనిపిస్తున్నాయి.
చేవెళ్ల: విద్యారంగ సమస్యలపై ఎంఎస్ఎఫ్ (మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్) పోరాడుతుందని సంఘం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి డాక్టర్ చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ అన్నారు. చేవెళ్లలో ఆదివారం ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జిల్లా కో ఇన్చార్జి నాని భానుప్రసాద్మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ.. పేద వర్గాల విద్యార్థుల పక్షాన పోరాడతామని తెలిపారు. సెప్టెంబర్ 8న చలో హైదరాబాద్ మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మేడ్చల్జిల్లా కో ఇన్చార్జి శివకృష్ణ, వికారాబాద్ జిల్లా కో ఇన్చార్జి రావణ్, నాయకులు వెంకట్, జానీ, గణేశ్, ఆదిత్య, అరుణ్, తరుణ్, శ్రీకాంత్, నందు, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
తుర్కయంజాల్: ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని చికెన్, మటన్ దుకాణాల్లో శంషాబాద్ జోనల్ వెటర్నరీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెటర్నరీ అధికారి రవిచంద్ర మాట్లాడుతూ.. పలు దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయని, స్లాటర్ కేంద్రాల నుంచి కాకుండా నేరుగా కట్ చేసి మాంసం విక్రయాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఇక మీదట ఇలా చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. విక్రయదారులు కూడా స్టాంప్ ఉన్న మటన్ను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. దుకాణాల యజమానులు పరిశుభ్రత పాటించడంతో పాటు, వారం రోజుల్లోగా ట్రేడ్ లైసెన్స్లను పొందాలని సూచించారు. లేని పక్షంలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించి, మొదటి విడతగా నోటీసులు జారీ చేశారు.
గ్రీన్ చానల్ ద్వారా ఊపిరితిత్తుల రవాణా
శంషాబాద్: శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి గ్రీన్ చానల్ ద్వారా ఊపిరితిత్తులను రవాణా చేశారు. ఆదివారం మధ్యాహ్న శ్రీకాకుళం నుంచి రోడ్డు మార్గం ద్వారా విశాఖపట్నం జెమ్స్ ఆస్పత్రికి చేరిన ఊపిరితిత్తులను అక్కడి నుంచి విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఇండిగో 6ఈ– 783 విమానంలో.. అక్కడి నుంచి 4.12 గంటలకు బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్టుకు 5.11 గంటలకు చేరుకున్నాయి. సీఐఎస్ఎఫ్ అధికారులు, ఆర్జీఐఏ ట్రాఫిక్ పోలీసుల సహకారంతో ఎయిర్పోర్టులో ఏర్పాటు చేసిన అంబులెన్స్లో వెంటనే తీసుకెళ్లి ఆర్గాన్స్ను ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తూ 30 నిమిషాల్లో సికింద్రాబాద్ కిమ్స్కు చేర్చారు.


