బోనమెత్తిన లష్కర్
లష్కర్ బోనమెత్తింది. భక్తజనం పోటెత్తింది. ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవోపేతంగా సాగింది. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాలు.. పోతురాజుల విన్యాసాలు.. కళాకారుల ఆటాపాటలు.. ప్రముఖుల రాకతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పణతో.. ఎటూ చూసినా భక్తజన సంద్రాన్ని తలపించింది. తీర్చిదిద్దిన తీరొక్క బోనాలతో మహిళలు మహంకాళి అమ్మవారికి నివేదించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. గోల్కొండలోనూ జగదాంబిక అమ్మవారికి ఆదివారం ఆరో బోనం పూజను ఘనంగా నిర్వహించారు.
– రాంగోపాల్పేట్


