అనంతగిరి: భగవద్గీత మానవ జీవితానికి దిక్సూచి అని సంగారెడ్డి జిల్లా ఫసల్వాది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకుడు మహేశ్వర శర్మ సిద్ధాంతి అన్నారు. వైభవలక్ష్మి ఆలయంలో గీతావాహిని ఆధ్వర్యంలో తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న భగవద్గీత పారాయణ మహోత్సవం ఆదివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతా సందేశం నేటి సమాజానికి అవసరమని అన్నారు. మహిళలు కుటుంబ వ్యవస్థకు మూలస్తంభాలన్నారు. వారి జీవన విధానం, దైవారాధనలో పాటించాల్సిన నియమాలు, పూజా విధానాలు, వివిధ వ్రతాలను శాస్త్రోక్తంగా ఎలా ఆచరించాలి, సనాతన ధర్మ సంప్రదాయాలను ఎలా పరిరక్షించాలి అనే అంశాలను వివరించారు. భక్తి, సేవ, ధర్మం, సత్సంకల్పం, నిత్య పారాయణం ద్వారా కుటుంబాల్లో శాంతి, సౌభాగ్యం, ఆధ్యాత్మిక వికాసం కలుగుతాయని చెప్పారు. తొమ్మిది రోజులుగా పారాయణం పెద్ద ఎత్తున చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గీతావాహిని అధ్యక్షురాలు శ్రీదేవిసదానంద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జయశ్రీ, ఆలయ నిర్వాహకురాలు స్వరూప రమేశ్, అర్చకులు విక్రమ్, మాజీ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేశ్, డాక్టర్ దీప భక్తవత్సలం, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సదానంద రెడ్డి, డాక్టర్ సత్యనారాయణ గౌడ్, అమరేందర్ రెడ్డి, నర్సింలు, ప్రవీణ్, గీతావాహిని సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
మహేశ్వర శర్మ సిద్ధాంతి


