హుడాకాంప్లెక్స్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని డిప్యూటీ కలెక్టర్ డి.రాంప్రసాద్ సూచించారు. సరూర్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష నాయకులు, బూత్స్థాయి ప్రతినిధుల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా ఇంటింటి పరిశీలన, అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చడం, మరణించిన లేదా శాశ్వతంగా వేరే ప్రాంతాలకు మారిన వారి వివరాలను సక్రమంగా పరిశీలించి చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సూచనలు, సలహాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అర్హత కలిగిన ఓటరుకు ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. కుటుంబసభ్యుల ఓట్లు ఒకే పోలింగ్ స్టేషన్లో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. సర్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్స్టేషన్ స్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్నట్టు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి తెలిపారు. తహసీల్దార్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణకు రాజకీయపార్టీలు, బీఎల్ఏలు, కాలనీ సంఘాల ప్రతినిధులు సమన్వయంతో సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు వక్కలంక శ్రీనివాస్రావు, బేర బాలకిషన్, సిద్ధు ముదిరాజ్, పాండురంగాచారి, ధనరాజ్గౌడ్, ఆరుట్ల సురేష్కుమార్, కబీర్దాస్ పాల్గొన్నారు.


